నంద్యాలలో గెలిస్తే: లెక్కచెప్పిన ఉండవల్లి, జగన్కు వైయస్ 'ప్రాంతీయ' షాక్
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహా ఉప ఎన్నికల్లో అధికార పార్టీనే గెలుస్తుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
అమరావతి: కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహా ఉప ఎన్నికల్లో అధికార పార్టీనే గెలుస్తుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి గెలిచినంత మాత్రాన రానున్న సార్వత్రిక ఎన్నికల్లోను ఆ పార్టీయే గెలుస్తుందని భావించడం పొరపాటు అని చెప్పారు.

డిపాజిట్ కోల్పోయిన టిడిపి గెలిచింది
ఇందుకు ఉండవల్లి ఉదాహరణ కూడా చెప్పారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో టిడిపికి ఆరువేల ఓట్లు, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎనిమిది వేల ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు. అప్పుడు టిడిపి డిపాజిట్ గల్లంతయిందన్నారు.

భారీ మెజార్టీతో టిడిపి గెలుపు
అదే 2014 సాధారణ ఎన్నికల్లో రామచంద్రాపురంలో 21వేల పై చిలుకు, నరసాపురంలో దాదాపు 17వేలకు పై చిలుకు ఓట్లతో టిడిపి గెలిచిందని గుర్తు చేశారు. ఉప ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందన్నారు.

జగన్కు కాంగ్రెస్ ప్రాంతీయ షాక్
మరోవైపు, వైసిపి అధినేత వైయస్ జగన్కు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రాంతీయ షాకిచ్చారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకమని వారు చెప్పారు. జాతీయ పార్టీలకు మాత్రమే అనుకూలమని అభిప్రాయపడ్డారు.

వైసిపి సరికాదని
తద్వారా, వైయస్ అభిప్రాయం ప్రకారం ప్రాంతీయ పార్టీ అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సరికాదని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. వైయస్ మృతి అనంతరం.. కేసుల నేపథ్యంలో జగన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications