జగన్ ధైర్యానికి ఉండవల్లి కితాబు-మార్గదర్శి తనిఖీలపై-రామోజీ తెలివికి భారతరత్న ఇవ్వాల్సిందే!
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి కంట్లో నలుసుగా మారిన రామోజీ గ్రూపు సంస్ధల అధినేత రామోజీరావును మార్గదర్శి కేసులో సీఎం జగన్ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. తన తండ్రి హయాంలో మార్గదర్శి సంస్ధలపై నమోదైన కేసులో ఇంప్లీడ్ కావడమే కాకుండా మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో తనిఖీలు కూడా చేపట్టారు. మార్గదర్శిపై జగన్ సర్కార్ దూకుడును ఈ కేసుకు కారకుడైన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసించారు.
మార్గదర్శిలో తనిఖీలు
ఏపీలో ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్ధ కార్యాలయాల్లో జగన్ సర్కార్ తాజాగా తనిఖీలు చేపట్టింది. మూడు రోజులుగా కొనసాగుతున్న తనిఖీల వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. దీనంతటికీ ప్రధాన కారణం రామోజీరావు ఈనాడు వార్తాపత్రిక అధినేత కావడమే.
గతంలో వైఎస్ హయాంలో మార్గదర్శి అక్రమాలపై ప్రభుత్వం కేసులు నమోదు చేయడం, దీనిపై రామోజీరావు న్యాయపోరాటనికి దిగడం జరిగాయి. అయితే ఆ తర్వాత ఈ కేసులు మూలనపడ్డాయి. ఇప్పుడు జగన్ వాటి దుమ్ముదులిపి మార్గదర్శిలో తనిఖీలు చేపట్టారు. దీనిపై ఈ కేసులకు కారణమైన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు.
జగన్ కు ఉండవల్లి ప్రశంస
ఏపీలో మార్గదర్శి చిట్ ఫండ్స్ పై కొనసాగుతున్న దాడులపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు.రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా మార్గదర్శిల్లో తనిఖీలు నిర్వహించిందని, మార్గదర్శి కేసు లా విద్యార్ధుల కేసు స్టడీకి ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.
గతంలో సుప్రీంకోర్టులో ఉన్న మార్గదర్శి కేసులో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ కావాలని ఉండవల్లి పలుమార్లు కోరినా జగన్ స్పందించలేదు. కానీ తాజాగా ఈనాడులో జగన్ సర్కార్ పై వార్తల దాడి పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది.
డిసెంబర్ 2న సుప్రీంకోర్టు విచారణ
డిసెంబర్2న సుప్రీంకోర్టులో మార్గదర్శి కేసు విచారణ జరగబోతోందని మాజీ ఎంపీ ఉండవల్లి వెల్లడించారు. డిపాజిట్ల సేకరణ ఆపేసినట్లు 2006లో రామోజీ చెప్పారని, డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని హైకోర్టు, సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేశారని ఉండవల్లి పేర్కొన్నారు.
కానీ ఇప్పటికీ డిపాజిట్లు వసూలు చేస్తూనే ఉన్నారన్నారు. మార్గదర్శి చిట్ఫండ్ పేరిట డబ్బులు సేకరించారని, గతంలో డిపాజిట్ అని ఉండేది, ఇప్పుడు రిసీట్ అని సేకరిస్తున్నారన్నారు. మార్గదర్శికి 3 శాతం డీఫాల్టర్లు కూడా లేరని ఉండవల్లి వెల్లడించారు. అందులో కిటుకు ఏంటని ప్రశ్నించారు. మార్చి31 నాటికి ఔట్ స్టాండింగ్ మాత్రం రూ.139 కోట్లుగా చూపించారన్నారు.
రామోజీకి భారతరత్న ఇవ్వాలన్న ఉండవల్లి
ఇండియాలో ఉన్న బ్యాంకులు రామోజీకి అప్పగిస్తే అద్భుతంగా నడిపిస్తారేమో అని ఉండవల్లి ఎద్దేవా చేశారు. మార్గదర్శి చైర్మన్ ఇప్పటికీ రామోజీనే అని ఉండవల్లి తెలిపారు. కానీ కోర్టులో మాత్రం తాను చైర్మన్ కాదంటున్నారని ఉండవల్లి విమర్శించారు. రామోజీ నువ్వు తప్పు చేశావా..? లేదా..? అనేది వాదనల్లో ముఖ్యమని ఉండవల్లి పేర్కొన్నారు.
ఇండస్ట్రియల్గా చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మీడియాను రామోజీ వాడుకుంటున్నారని ఉండవల్లి ఆరోపించారు. రామోజీకి రెండు టోపీలు ఉన్నాయని సుప్రీం జడ్జి చెప్పారని, రామోజీకి ఉన్న రెండు టోపీల్లో ఒకటి మీడియా..రెండోది ఇండస్ట్రియలిస్ట్ అని అన్నారు. రామోజీ తెలివితేటలకు పద్మవిభూషణ్ కాదు..భారతరత్న ఇవ్వాలన్నారు.