కీలక నిర్ణయం దిశగా బాలినేని - జిల్లా ఎమ్మెల్యేలతో భేటీ : ఫలించని బుజ్జగింపులు..!!
ఏపీ కేబినెట్ ఏర్పాటు అసంతృప్తులు ఇంకా తగ్గలేదు. మాజీ మంత్రుల్లో సీఎం జగన్ తిరిగి 11 మందికి అవకాశం ఇచ్చారు. అయితే, బాలినేని..సుచరిత కు మంత్రి పదవులు దక్కలేదు. దీంతో..సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఇక, బాలినేని మాత్రం తనను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ కు బంధువు..వైసీపీ సీనియర్ నేత అయిన బాలినేని..ప్రకాశం జిల్లాలో పార్టీకి కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో జగన్ కోసమే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి వదులుకున్నారు.

జగన్ నిర్ణయం పై బాలినేని అసంతృప్తి
జగన్ తన కేబినెట్ లోని మంత్రులను అందరినీ తప్పించి..కొత్త వారితో విస్తరణ చేస్తారని తొలుత బయట పెట్టింది బాలినేని. తాజాగా, జగన్ మంత్రుల రాజీనామాలు కోరిన సమయంలోనూ..సామాజిక సమీకరణాల కారణంగా అయిదుగురు లేదా అరుగురిని కొనసాగించాల్సి ఉంటుందని చెప్పారు.
ఆ సమయంలోనూ బాలినేని సీఎంతో చర్చలు చేపట్టారు. ప్రకాశం జిల్లా నుంచి తప్పిస్తే ఇద్దరు మంత్రులనూ తప్పించాలని..లేదంటే ఇద్దరినీ కొనసాగించాలని కోరారు. తనను తప్పించి..సురేష్ ను కొనసాగిస్తే రాజీకయంగా తనకు ఇబ్బందులు వస్తాయని ..పార్టీకి జిల్లాలో నష్టం జరుగుతుందని వివరించారు. ఇక, కేబినెట్ కూర్పు తుది దశలో బాలినేని తనకు అవకాశం దక్కటం లేదని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే సజ్జల రంగంలోకి దిగారు.

ఫలించని బుజ్జగింపులు.. ప్రకాశం నేతల మద్దతు
నేరుగా బాలినేని నివాసానికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేసారు. ఆ సమయంలోనే బాలినేని రాజకీయాలకు దూరం అవుతానంటూ ప్రకటించేందుకు సిద్దం అయ్యారు. ఆ సమయంలోనే ప్రకాశం జిల్లా నుంచి ఎవరికీ మంత్రి పదవి ఇవ్వటం లేదని చెప్పుకొచ్చారు.
ముందుగా విడుదల చేసిన మంత్రుల జాబితాలోనూ ప్రకాశం కు మంత్రి పదవి లేదు. ఆ తరువాత అనంతపురం జిల్లా నుంచి తొలుత ఎంపిక చేసిన తిప్పేస్వామిని తప్పించి..చివరకు ఆదిమూలపు సురేష్ పేరు ప్రకటించారు. దీంతో..బాలినేని ఆగ్రహం వ్యక్తం చేసారు.
దీంతో మరోసారి సజ్జల ఆయన నివాసానికి వెళ్లారు. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సైతం బుజ్జగించే ప్రయత్నం చేసారు. కానీ, బాలినేని మెత్తబడలేదు. ఇక, ఈ ఉదయం నుంచి ప్రకాశంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బాలినేనికి లేని పదవులు తమకు వద్దంటూ ఒంగోలు - చీరాల ప్రాంతంలోని వైసీపీ నేతలు తమ పదవులకు రాజీనామాలకు సిద్దపడ్డారు.

బాలినేని నిర్ణయం పై ఉత్కంఠ
జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు బాలినేనితో సమావేశమయ్యారు. ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా కలిసి కట్టుగా మద్దతిస్తామని చెప్పారు. దీంతో..బాలినేనితో కలిసి పని చేసిన సహచర మంత్రులు రంగంలోకి దిగారు. బాలినేనికి పార్టీ పరంగా కీలక బాధ్యతలు అప్పగించేలా మధ్యవర్తిత్వం జరుగుతున్నట్లు సమాచారం.
కేబినెట్ హోదాతో ఆయనకు పదవి అప్పగించేలా మంతనాలు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే, అన్నా రాంబబు లాంటి వారు బాలినేనికి మద్దతుగా రాజీనామాకు సిద్దమని ప్రకటించారు. కానీ, ఎవరూ రాజీనామాలు చేయవద్దని బాలినేని సూచించినట్లుగా సమాచారం. ఈ సాయంత్రం బాలినేనికి పార్టీ పరంగా కల్పించే ప్రాధాన్యత- పదవి పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ తరువాత బాలినేని తన రాజకీయ భవిష్యత్ పైన నిర్ణయం ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో..ఒంగోలు వైసీపీలో బాలినేని నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications