మరో అంతర్వేది- రథానికి నిప్పు: అప్పుడు జగన్పై- ఇప్పుడు ఎవరిపై వేస్తారు?
Rayadurgam: అనంతపురం జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల హనకనహాల్ గ్రామంలో గల ప్రాచీన శ్రీరామచంద్రస్వామివారి ఆలయానికి చెందిన రథం మంటలబారిన పడింది. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఈ రథానికి నిప్పు పెట్టి ఉంటారని అనుమానిస్తోన్నారు.
సుమారు 20 అడుగుల ఎత్తు వరకు ఉన్న ఈ రథం మంటల బారిన పడటం స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. విషయం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున గ్రామస్తులు ఆలయానికి చేరుకున్నారు. రథానికి నిప్పు పెట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదంటూ డిమాండ్ చేశారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితులను సమీక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. సమగ్ర దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఈ ఘటన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
ఆలయం వెలుపల నిర్మించిన షెడ్లో స్వామివారి రథాన్ని ఉంచుతారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రత్యేక ఉత్సవాలు, పండుగలు తిరునాల సందర్భంగా షెడ్లో నుంచి రథాన్ని బయటికి తీసుకొస్తారు. ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. హనకనహాల్ తిరునాళ్లుగా జిల్లావ్యాప్తంగా గుర్తింపు పొందింది.
సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత హఠాత్తుగా షెడ్లో మంటలు చెలరేగాయి. అగ్నికీలల బారిన పడి రథం కాలిపోయింది. చక్రాలు, రథం మధ్యం పూర్తిగా దగ్ధమైంది. దట్టమైన పొగ అలముకోవడం, షెడ్లో నుంచి మంటలు వస్తోండటాన్ని గుర్తించిన స్థానికులు హుటాహుటిన ఆలయం వద్దకు చేరుకుని ఆర్పివేశారు. ఫలితంగా- రథం పైభాగం వరకు మంటలు వ్యాపించలేదు.
ఈ ఘటన ప్రమాదవశావత్తు చోటు చేసుకుందా? లేక ఉద్దేశపూరకంగా గుర్తు తెలియని వ్యక్తలు ఎవరైనా ఈ ఘటనకు పాల్పడ్డారా? అనేది తేలాల్సి ఉంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
ఈ ఘటన- 2021లో అప్పటి తూర్పు గోదావరి జిల్లా, ఇప్పటి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. అప్పట్లో అంతర్వేది రథం కూడా ఇలాగే మంటలు బారిన పడిన విషయం తెలిసిందే.
ఈ ఘటన అప్పట్లో రాజకీయ రంగు పులుముకొంది. వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యంగా తెలుగుదేశం-జనసేన- భారతీయ జనతా పార్టీలు అభివర్ణించాయి. జగన్ వల్ల దేవాలయాలు మంటల పాలవుతున్నాయని, ఆలయాల ప్రతిష్ఠ మసకబారుతోందంటూ రోజుల తరబడి ఆందోళన చేశాయి. జగన్ను హిందూ వ్యతిరేకిగా విమర్శించాయి.












Click it and Unblock the Notifications