మంకీ క్యాప్లతో తుపాకులు ధరించి ఎటిఎం దోపిడీకి యత్నం
కాకినాడ: గుర్తు తెలియని దుండగులు తూర్పు గోదావరి జిల్లాలో ఎటిఎం దోపిడీకి విఫలయత్నం చేశారు. మాజీ రక్షణశాఖ సహాయమంత్రి ఇంటికి కూతవేటు దూరంలో స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఏటీఎం సెంటర్లో వారు అందుకు తెగబడ్డారు. కాకినాడ నడిబొడ్డులో గల ఎటిఎంలోకి ఆదివారం తెల్లరుజామున మంకీక్యాప్లు ధరించిన అగంతకులు మోటారు సైకిల్పై వచ్చి తుపాకీలతో సెక్యూరిటీగార్డ్స్ను బెదిరించి, అతని చేతులకు, నోటికి ప్లాస్టర్లు వేసి బంధించారు. అనంతరం ఏటీఎం సెంటర్ను కొల్లగొట్టేందుకు విఫలయత్నం చేశారు.
అటుగా అలికిడి అవడంతో చేసేది లేక అక్కడ నుంచి ఉడాయించారు. కాకినాడ క్రైం డీఎస్పీ పిట్టా సోమశేఖర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి - స్ధానిక సూర్యారావుపేట, రాఘవేంద్రస్వామి గుడి సమీపంలోని, యూకో బ్యాంక్ పక్కనే ఎస్బీఐ ఏటీఎం సెంటర్ ఉంది. అందులో పెదపూడి మండలం, జి.మామిడాడకు చెందిన ద్వారంపూడి భాస్కరరెడ్డి సెక్యూరిటీగార్డ్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లారుజాము 2, 3 గంటల మధ్య ప్రాంతంలో మంకీక్యాప్లు ధరించిన ముగ్గురు వ్యక్తులు మోటారు సైకిల్పై వచ్చి ఏటీఎం సెంటర్ వద్ద దిగారు.
ముగ్గురూ ఒక్కసారిగా లోనికి ప్రవేశించడంతో వారిని మంకీ క్యాప్లు తీసి డబ్బు డ్రా చేయాల్సిందిగా భాస్కరరెడ్డి సూచించారు. దాంతో ఆ ముగ్గురూ భాస్కరరెడ్డికి తుపాకులు ఎక్కపెట్టి అనంతరం పార్శిల్ ప్లాస్టర్లతో చేతులు, నోటిని బంధించి లోపల గదిలో పడవేశారు. తదుపరి వారి కూడా తెచ్చుకున్న గుణపం వంటి వస్తువుతో ఏటీఎం మిషన్ పెకలించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. అయినా నగదు బయటకు రాకపోవడంతో వివిధ రకాలుగా ప్రయత్నించి విఫలమయ్యారు. ఇంతలో రోడ్డుపై వాహనాల అలికిడి అవ్వడంతో అక్కడి నుంచి పారిపోయారు.
అనంతరం కాసేపటికి భాస్కరరెడ్డి ప్లాస్టర్ కట్లు విప్పుకుని నెమ్మదిగా రోడ్డుపైకి వచ్చాడు. అంతలో భాస్కరరెడ్డికి నైట్బీట్ పోలీసులు అగుపడడంతో వారి సహాయంతో టూటౌన్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం డీఎస్పీ సోమశేఖర్ సంఘటనా స్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. సెక్యూరిటీగార్డు భాస్కరరెడ్డి నుంచి వివరాలు సేకరించారు. ఆదివారం క్లూస్టీం ఏటీఎం సెంటర్కు చేరుకుని వేలిముద్రలను సేకరించింది. టూటౌన్ క్రైం ఎస్సై ఆలీఖాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.