ఏపీ ఆదాయమంతా విదేశాలకు తరలింపోతోందా ? కేంద్రమంత్రి శోభా కరంద్లాజే అనుమానం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచే రాష్ట్రానికి అప్పులున్నా జగన్ వచ్చాక ఆ అప్పులు మరింత పెరిగాయి. భారీ ఎత్తున అమలవుతున్న సంక్షేమ పథకాలకోసమంటూ రాష్ట్రం రిజర్వు బ్యాంకు సహా పలు ఆర్ధిక సంస్ధల దగ్గర భారీగా అప్పులు చేస్తోంది. వీటికోసం మద్యం ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టే పరిస్దితికి వచ్చేసింది. దీనిపై ఓవైపు విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో ఏపీలో పర్యటిస్తున్న కేంద్రమంత్రులు కూడా దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏపీలో కేంద్రమంత్రుల పర్యటనల్లో భాగంగా అనంతపురానికి వచ్చిన మంత్రి శోభా కరంద్లాజే జగన్ సర్కార్ పై నిశిత విమర్శలు చేశారు. ముఖ్యంగా జగన్ సర్కార్ చేస్తున్న అప్పులు, రాష్ట్రానికి వస్తున్న ఆదాయంపై ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. జగన్ పాలన అప్పులు, అవినీతితో పరాకాష్టకు చేరుకుందని, ప్రస్తుతం రాష్ట్ర ఖజానాలో చిల్లి గవ్వ లేదని, రాష్ట్రానికి వస్తున్న ఆదాయమంతా ఎటు పోతోందని ఆమె సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయమంతా విదేశాలకు తరలిపోతోందా అని శోభా కరంద్లాజే అనుమానం వ్యక్తం చేశారు.
Recommended Video
రాష్ట్రంలో జగన్ సర్కార్ పోలీసులకు జీతాలు కూడా ఇవ్వలేని స్ధితిలో ఉందని శోభా కరంద్లాజే విమర్శించారు. వైసీపీ మూడేళ్ల పాలనలో ఒక్క కాలేజీ అయినా కట్టారా ? ఒక్క రోడ్డు అయినా వేశారా ? అని కేంద్రమంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎంపీ లేకపోయినా ప్రధాని మోడీ మాత్రం రాష్ట్రానికి నిధులు ఇస్తూనే ఉన్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఏర్పాటుచేసిన 6 ఎయిమ్స్ లో భాగంగా ఏపీలోని మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ ను జూలై 4న ప్రధాని మోడీ ప్రారంభిస్తారని శోభా వెల్లడించారు.