అవమానాలు, ఛీత్కారాలు: సివిల్స్ 3వ ర్యాంకర్ ఈ తెలుగు రైతు బిడ్డ
ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఎదురైన కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగాడు ఆ యువకుడు. తెలుగు మీడియా అయినా.. ఎక్కడా వెనుకడుగు వేయకుండా లక్ష్యం దిశగా అహర్నిశలు శ్రమించాడు.
అమరావతి: ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఎదురైన కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగాడు ఆ యువకుడు. తెలుగు మీడియా అయినా.. ఎక్కడా వెనుకడుగు వేయకుండా లక్ష్యం దిశగా అహర్నిశలు శ్రమించాడు. చివరకు యూపీఎస్సీ పరీక్ష ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 3వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. అతడే ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పారసంబకు చెందిన రోణంకి గోపాలకృష్ణ.
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పారసంబకు చెందిన రోణంకి అప్పారావు, రుక్మిణిల రెండవ సంతానమైన రోణంకి గోపాలకృష్ణ పాఠశాల విద్య నుంచి ఇంటర్ వరకూ తెలుగు మీడియంలోనే చదివారు. ఆంధ్రాయూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ నుంచి బీఎస్సీ (ఎంపీసీ) పట్టా పుచ్చుకున్నారు.
అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా దూబచర్లలోని డైట్ లో టీటీసీ ట్రైనింగ్ అయ్యారు. 2007లో డీఎస్సీ రాసి సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) గా ఎంపికై, రేగులపాడులో టీచర్గా పని చేస్తున్నారు. సివిల్స్ కు కోచింగ్ తీసుకుంటే ఫలితముంటుందని భావించాడు. ఆ వెంటనే ఆరు నెలల క్రితం ఆయన హైదరాబాదు చేరుకున్నారు.

సివిల్స్ కు ప్రిపేర్ అవుతానంటూ హైదరాబాదులో అడుగుపెట్టిన సమయంలో ఎదుర్కొన్న ఛీత్కారాలను ఈ సందర్భంగా గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు.
వచ్చీ రాగానే కోచింగ్ కోసం పలు సెంటర్లను ఆశ్రయించారాయన. ఈ సమయంలో ఆయన ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఎదుర్కొన్నారు. తెలుగు మీడియం విద్యార్థి కావడంతో... ఏ కోచింగ్ సెంటర్ కు వెళ్లినా సివిల్స్కు 'నువ్వు పనికిరావు' అంటూ అడ్మిషన్ ఇవ్వడానికే నిరాకరించారని గోపాలకృష్ణ తెలిపారు.
అయినా సరే, దేవుని దయ, అమ్మానాన్నల దీవెనలు, అన్నయ్య కోదండరావు (ఎస్బీఐ ఉద్యోగి) స్పూర్తి, స్నేహితుల సహకారం.. పట్టుదలతో చదువుకున్నానని గోపాలకృష్ణ తెలిపారు. తమ ఊరికి కరెంట్ లేకపోతే దీపం వెలుగులో చదువుకున్నానని, ఇప్పటికీ తమ ఊరికి న్యూస్ పేపర్ అంటే ఏమిటో తెలియదని ఆయన చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో చదువుకున్న తనకు ఈ ఫలితం చాలా ఆనందాన్నిచ్చిందని ఆయన తెలిపారు.
కాగా, తమ కుమారుడు సాధించిన ఈ విజయం పట్ల గోపాలకృష్ణ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఇలావుంటే తెలంగాణకు చెందిన ఇంజినీర్ ముజమిల్ ఖాన్(విశ్రాంత ఐపీఎస్ ఏకే ఖాన్ కుమారుడు)కు ఆలిండియా 22వ ర్యాంక్ దక్కింది. కర్ణాటకకు చెందిన నందిని మొదటి ర్యాంక్ సాధించారు.












Click it and Unblock the Notifications