ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీ అధికారంలోకి రాదు!!??
తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఉరవకొండ ఒకటి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీ అధికారంలోకి రాదు అనే సెంటిమెంట్ ఉంది ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడానికి పయ్యావుల ప్రయత్నిస్తున్నారు.

ఉరవకొండ రాజకీయం ఆసక్తికరం
1999లో ఉరవకొండలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. 2004, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపొందగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ గెలుపొందగా టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. 2019 ఎన్నికల్లో పయ్యావుల గెలుపొందగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుత రాజకీయం ఈ నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారింది. రానున్న ఎన్నికల్లో ఉరవకొండ రాజకీయం ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం మాజీ ఎమ్మెల్యే, ఆయన సోదరుడు.

ఒంటెత్తు పోకడలవల్లే ఓటమి
2019 ఎన్నికల్లో పయ్యావుల చేతిలో విశ్వేశ్వరరెడ్డి పోటీచేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా ఆయనే కొనసాగుతున్నారు. ఉరవకొండ నియోజకవర్గ పరిధిలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు ఆయన కుమారుడు కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు. తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో ఒంటెత్తు పోకడలవల్లే వైసీపీ ఓడిపోతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విశ్వేశ్వరరెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి గత ఎన్నికల్లో సమన్వయం లేకపోవడంవల్లే ఓటమిపాలయ్యామంటూ పరోక్షంగా తన సోదరుడు విశ్వేశ్వర్ రెడ్డిపై మండిపడ్డారు. ఆ సమావేశానికి హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధుసూదన్ రెడ్డి చేతిలో నుంచి మైకు తీసుకోవడంతోపాటు విభేదాలు మాని అందరూ పార్టీ కోసం పనిచేయాలని చెప్పి వెళ్లిపోయారు.

కొనసాగుతున్న విభేదాలు
అయినప్పటికీ నియోజకవర్గంలో వైసీపీ నాయకుల మధ్య విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. విశ్వేశ్వర్ రెడ్డితోపాటు మధుసూదన్ రెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ తన సోదరుడికి సీటిస్తే అవసరమైతే పార్టీని ఓడించడానికి కూడా సిద్ధమేనని ఆయన తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇది పయ్యావుల కేశవ్ కు బలంగా మారుతోంది. నియోజకవర్గంలో ఉన్న విభేదాలు ఇప్పటికీ కొలిక్కి రాకపోగా రోజురోజుకూ తీవ్రతరమవుతున్న తరుణంలో అధిష్టానం ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి దిద్దుబాటు చర్యలు చేపడుతుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications