తెలుగు విద్యార్థులను వెనక్కి పంపించలేదట, ప్రవేశం నిరాకరించారట
చెన్నై/ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల నుంచి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులను తాము వెనక్కి పంపించలేదని, అమెరికాలోకి ప్రవేశం మాత్రమే నిరాకరించామని అమెరికా ఎంబసీకి చెందిన మినిస్టర్ కౌన్సిలర్ ఫర్ కాన్సులర్ అఫైర్స్ పాంపర్ తెలిపారు. శుక్రవారం ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు బలవంతంగా భారత్కు పంపించడంపై అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని బలవంతంగా పంపించలేదని తెలిపారు.
శాన్జోస్లోని సిలికాన్ వ్యాలీ విశ్వవిద్యాలయం, ఫ్రెమంట్లోని నార్త్వెస్టర్న్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులే ఎక్కువ మంది తిరిగి వచ్చేశారని ఆయన చెప్పారు. ఈ రెండు విశ్వవిద్యాలయాలను అమెరికా బ్లాక్లిస్టులో పెట్టలేదని స్పష్టం చేశారు. అమెరికాలో అయినా, భారత్లో అయినా ఆ దేశం ఇచ్చే వీసా ఒక్కటే సరిపోదని అన్నారు. వాస్తవానికి రెండు రకాల పద్ధతులు పాటిస్తుంటారని చెప్పారు.
వీసా అంటే కేవలం ఆ దేశంలోకి ప్రవేశించడానికి ఒక అనుమతి మాత్రమేనని తెలిపారు. అక్కడ ఆ వ్యక్తిని దేశంలోకి అనుమతించాలా వద్దా అనే అంశం కస్టమ్స్, బోర్డర్ కంట్రోల్, ఇమ్మిగ్రేషన్ తదితర అనేక విభాగాలకు చెందిన అధికారులు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు.
తెలుగు విద్యార్థులకు ప్రవేశ అనుమతి నిరాకరించడానికి ఆ విశ్వవిద్యాలయాలు ఎంత మాత్రం కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. భారత్ తిరిగొచ్చిన విద్యార్థులు తమను అక్కడ అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వేధించారని చెప్పడం బాధాకరమన్నారు. అక్కడ విద్యార్థులను ఎవరూ వేధింపులకు గురి చేయలేదని తెలిపారు.
అమెరికాలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు ముందుగా వీసా, ఇతరత్రా సమస్యలకు సంబంధించి పూర్తి సమాచారం కోసం ‘ఎడ్యుకేషన్యూఎస్ఏ' సంస్థను సంప్రదించాలన్నారు. www.educationusa.state.gov వెబ్సైట్లో పూర్తి అధికారిక సమాచారం ఉంటుందని, దీని ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవాలని సూచించారు.
తెలుగు విద్యార్థులకు న్యాయం చేయాలి..
అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన భారతీయ విద్యార్థులను వెనక్కి పంపిస్తుండడం వల్ల విద్యార్థులు ఆర్థికంగా, విద్యాపరంగా తీవ్రంగా నష్టపోతున్నారనీ, వారికి అమెరికా ప్రభుత్వం న్యాయం చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కోరారు.
ఆ విశ్వవిద్యాలయాలు నకిలీవైతే అమెరికా ప్రభుత్వం వాటిని ఎందుకు నిషేధించలేదనీ, ఆ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం వీసా దరఖాస్తు చేసుకున్నప్పుడే ఎందుకు తిరస్కరించలేదని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులకు జరిగిన నష్టానికి పరిహారంగా ఒక్కో విద్యార్థికి రూ.కోటి చెల్లించాలని, మరో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు కల్పించాలని కోరారు. ఈ మేరకు నారాయణ శుక్రవారం హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ జనరల్కు వినతిపత్రం అందజేశారు.