విశాఖ గ్యాస్ ప్రభావంతో స్పృహ కోల్పోయిన రైలు డ్రైవర్, గార్డ్.. వాల్తేర్ డివిజన్లో రైళ్లన్నీ రద్దు...
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది మృత్యువాత పడి వందలాది మంది ఆస్పత్రి పాలైనా... ఇంకా గ్యాస్ ప్రభావం మాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు. తాజాగా వాల్తేర్ డివిజన్ లో ప్రయాణిస్తున్న ఓ గూడ్స్ రైల్ డ్రైవర్, గార్డు గ్యాస్ పీల్చి అపస్మారక స్ధితిలోకి వెళ్లారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు వాల్తేర్ డివిజన్లో అన్ని రైలు సర్వీసులను రద్దు చేశారు.
సృహకో్ల్పోయిన డ్రైవర్, గార్డు...
విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్ట్రైరీన్ గ్యాస్ లీకేజీ ప్రమాదం ప్రభావం తగ్గినట్లేనని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్ధాయిలో వాస్తవ పరిస్దితులు అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. తాజాగా సింహాచలం ఉత్తర స్టేషన్ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఓ గూడ్స్ ట్రైన్ రాగానే దాన్ని నడుపుతున్న లోకో పైలట్ జీవన్ కుమార్, గార్డు మండల్ స్పృహ కోల్పోయారు. గూడ్స్ రైలు ముందుకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రైలు ముందుకు కదల్లేదు. వాకీటాకీ, ఫోన్ ద్వారా ప్రయత్నంచినా స్పందన లేకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చి వెళ్లి చూడగా లోకోపైలట్, గార్డు అపస్మారక స్దితిలో కనిపించారు.
కళ్ల మంటలు, వాంతులు...
గూడ్స్ రైలులో అపస్మారక స్ధితిలో పడి ఉన్న లోకోపైలట్ జీవన్ కుమార్, గార్డు మండల్ ను వెంటనే అధికారులు స్ధానిక రైల్వే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిద్దరూ కళ్ల మంటలు, వాంతులతో బాధపడుతున్నట్లు తేలింది. చికిత్స అనంతరం వీరిద్దరినీ నిన్న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో వైజాగ్ లో లీకైన స్ట్రైరీన్ గ్యాస్ ప్రభావం ఇంకా తగ్గలేదని తెలుస్తోంది. తాజా ఘటన నేపథ్యంలో గ్యాస్ ఎంత వరకు వ్యాపించింది, రైల్వేపై దీని ప్రభావం ఎంత ఉందనే అంశాలను పరిశీలిస్తున్నారు.
Recommended Video
వాల్తేర్ డివిజన్ లో రైళ్ల రద్దు..
వాల్తేర్ డివిజన్ పరిధిలో గ్యాస్ లీకేజీ ప్రభావం రైళ్లను నడిపే లోకోపైలట్లు, ఇతర సిబ్బందిపై కూడా పడుతున్నట్లు గుర్తించిన అధికారులు... ఈ రూట్ లో వెళ్లే అన్ని పాసింజర్, గూడ్స్ రైళ్లను రద్దు చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ రైళ్లను నడపబోమని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ అధికారులతో రైల్వేఅధికారులు చర్చలు జరుపుతున్నారు. గ్యాస్ ప్రభావం పూర్తిగా తగ్గిందని తేలిన తర్వాతే రైళ్లను నడిపే అవకాశముంది.