చంద్రబాబుకు అభిమానిని: టీడీపీలో చేరనున్న వాణీ విశ్వనాథ్
నిన్నటి తరం సినీ కథానాయిక వాణీవిశ్వనాథ్ త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.
అమరావతి: నిన్నటి తరం సినీ కథానాయిక వాణీవిశ్వనాథ్ త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా టీడీపీ సీనియర్ నేతలు ఆనం శ్రీహరినాయుడు, దూర్వాసులు నాయుడు, హరినాయుడు తదితరులు ఆదివారం చెన్నై వెళ్లి ఆమెను కలిసినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా టీడీపీలో చేరాలని వారు కోరగా.. అందుకు ఆమె అంగీకరించారు. ఈ సందర్భంగా వాణీవిశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. పలు తెలుగు సినిమాల్లో తాను నటించానని చెప్పారు. తన అభివృద్ధికి కారకులైన తెలుగువారి కోసం ఏదైనా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నానని అన్నారు.
అంతేగాక, తనకు సీఎం చంద్రబాబు నాయకత్వమంటే ఎంతో అభిమానమనివాణి విశ్వనాథ్ చెప్పారు. యావత్తు దక్షిణ భారతదేశం చంద్రబాబు నాయకత్వం గురించి, ఆయన విజన్ గురించి చర్చించుకుంటోందని అన్నారు. త్వరలోనే ఏపీ రాజధాని అమరావతికి వెళ్లి టీడీపీలో చేరతానని చెప్పారు.
కాగా, దక్షిణాది నటి వాణీ విశ్వనాథ్ తెలుగుతోపాటు మలయాళం, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించారు. తాజాగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక చిత్రంలో వాణీ విశ్వనాథ్ నటించి తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు.