వరవర రావు అరెస్ట్, అనుమతి లేదని పోలీసులు
హైదరాబాద్: ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక పేరిట హైదరాబాద్ ఇందిరాపార్క్లో ఆదివారం సమావేశం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్న విరసం నేత వరవర రావును, విరసం కార్యకర్తలను పోలీసులు శనివారం రాత్రి కాచిగూడలోని తుల్జాభవన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
ఆదివారం సమావేశం ఏర్పాటు చేయతలపెట్టిన వరవరరావు ప్రభృతులు పోలీసుల అనుమతి కోరుతూ నగర పోలీసులకు వినతి పత్రం అందజేశారు. పోలీసులు నిరాకరించిన దరిమిలా వరవర రావు హైకోర్టును ఆశ్రయంచగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక తలపెట్టిన సమావేశానికి హైకోర్టు కూడా అనుమతి నిరాకరించింది.
ఈ మేరకు వేదిక కన్వీనర్, విరసం నేత వరవర రావు కోర్టులో వేసిన లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అంతకుముందు రాజకీయ వేదిక సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి కోరుతూ వరవర రావు నగర పోలీసులకు అందజేసిన వినతిప్రతం అందజేసినప్పటికీ శాంతి భద్రతల సమస్యలు తలెత్తేఅవకాశం ఉన్నందున పోలీసులు అనుమతి నిరాకరించారు.
రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక సదస్సు నేపథ్యంలో ముందస్తుగా అరెస్టు చేసిన వరవర రావును వెంటనే విడుదల చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నేడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించాల్సిన సదస్సుకు హైకోర్టు అనుమతి నిరాకరించిందని పోలీసులు తెలిపారు.
అందుకే, తాము ఈ సదస్సుకు అనుమతివ్వలేమని స్పష్టం చేశారు. ఎలాగైనా నిర్వహిస్తామని వరవర రావు ప్రకటించడంతో, గతరాత్రి ముందస్తుగా ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయనతోపాటు పలువురిని మందిని అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. సభకు అనుమతి లేదని డీసీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు.