రాష్ట్రాన్ని తాకట్టు పెడ్తారా?: బాబుపై వాసిరెడ్డి, భవనాలు కాదన్న గల్లా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె శుక్రవారం మాట్లాడుతూ.. ఏపిలో బహుళజాతి సంస్థల(ఎమ్మెన్సీల) రిటైల్ ఔట్లెట్లకు చంద్రబాబు అనుమతివ్వడం దారుణమని మండిపడ్డారు.
ఈ అనుమతుల వెనక ఉన్న గుట్టేమిటో తెలపాలని ఆమె డిమాండ్ చేశారు. ఎమ్మెన్సీల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడమే మీ లక్ష్యమా అని ఆమె చంద్రబాబును నిలదీశారు. ఆ సంస్థలకు అనుమతి ఇచ్చినందుకు తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్నివేల కోట్ల ముడుపులు అందాయని ప్రశ్నించారు.
గతంలో ఎఫ్డిఐలను వ్యతిరేకించిన చంద్రబాబునాయుడు ఇప్పుడేందుకు స్వాగతిస్తున్నారని అన్నారు. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా వ్యవహరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది చిల్లరవర్తకులు మీకు ఇప్పుడు గుర్తుకు రావడం లేదా? అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.
నవ్యాంధ్ర రాజధానికి తుళ్ళూరే సరైన ప్రాంతం: గల్లా
గుంటూరు: నవ్యాంధ్ర నూతన రాజధానిగా తుళ్లూరు ప్రాంతమే సరైందని గుంటూరు తెలుగుదేశం ఎంపి గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరికీ అందుబాటులో ఉండే విధంగా... ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం జరుగుతుందని, ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకువస్తామని అన్నారు.
రాజధాని అంటే భవనాలు కాదని.. ప్రజా జీవనమని ఆయన అన్నారు. జనవరి 10న చిత్తూరు జిల్లా పేటమెట్టలో అమరరాజా గ్రూప్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్మిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే తుళ్ళూరులోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్లు గల్లా జయదేవ్ వెల్లడించారు.