చిరు లేని పవన్ ఎక్కడ ? నాగబాబు బ్లాక్ మెయిలింగ్- వదిలేసిన బీజేపీ-వెల్లంపల్లి కామెంట్స్
ఏపీలో వైసీపీసి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వైసీపీ నేతలు నిత్యం టార్గెట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇవాళ పవన్ పై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా చిరంజీవి సాయంతో పవన్ ఎదిగిన తీరు, అలాగే బీజేపీ-జనసేన సంబంధాలపై ఆయన ఇవాళ కీలక విమర్శలు చేశారు.
చిరు లేకుండా పవన్ ఎక్కడ ?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వైసీపీని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రరాష్ట్రానికి పనికిరాడన్నారు. చిరంజీవి లేకుండా పవన్ కళ్యాణ్ ఎవరికీ తెలుసన్నారు. మెగాస్టార్ లేనిదే , పవర్ స్టార్ ఎక్కడని వెల్లంపల్లి ప్రశ్నించారు. తద్వారా చిరంజీవిని పవన్ వాడుకుంటున్నారనే అర్దం వచ్చేలా వెల్లంపల్లి వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి ఫాన్స్ కు నాగబాబు బ్లాక్ మెయిల్
పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి విధీ విధానం లేదని వెల్లంపల్లి విమర్శించారు. చిరంజీవి ఫ్యాన్స్ ను నాగబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని వెల్లంపల్లి ఆరోపించారు. చిరంజీవి ఫ్యాన్స్ మొత్తం జనసేన కి సపోర్ట్ చేయాలని నాగబాబు చెప్పడం చిరంజీవిని అవమానించటమేనన్నారు. తాజాగా విజయవాడలో నిర్వహించిన చిరంజీవి అభిమానుల సదస్సు, నాగబాబు వ్యాఖ్యల్ని గుర్తుచేస్తూ వెల్లంపల్లి ఈ వ్యాఖ్యలు చేసారు.
పవన్ మాటలోడే ?
పవన్ కళ్యాణ్ మాటలోడే తప్ప చేతలోడు కాదన్నారు. మొట్ట మొదట అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడు పవన్ అని వెల్లంపల్లి సూచించారు. మోడీ,అమిత్ షాలకు పవన్ వెధవ వేషాలు తెలుసన్నారు. బిజెపితో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర సంక్షేమ కోసం ఒక్కరోజైనా పని చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజ్ తీసుకొని పవన్ కళ్యాణ్ బిజెపితో టచ్ లో ఉన్నాడన్నారు. బిజెపి వాళ్లు పవన్ కళ్యాణ్ ని పట్టించుకోవడం లేదని, పవన్ మాత్రం బిజెపి భజన చేస్తున్నాడని వెల్లంపల్లి విమర్శించారు.