స్టైలే వేరు: వెంకయ్య ఉషాపతియే గానీ ఉపరాష్ట్రపతి కాదట!
న్యూఢిల్లీ: చమత్కారాలను గుప్పించడంలో కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు పేరెన్నిక గన్నారు. ఆయన మాట్లాడితే జర్నలిస్టులు శీర్షికలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఆయనే శీర్షికను ఇచ్చేస్తారు. ఇప్పుడు కూడా ఆయన అటువంటి శీర్షికే ఇచ్చారు.
తాను ఉషాపతినే గానీ ఉప రాష్ట్రపతిని కాదని ఆయన చమత్కరించారు. ఉషాపతి ఆయన భార్య పేరు. తాను ఉప రాష్ట్రపతి పదవికి నామినేట్ కావడం లేదని చెప్పడానికి ఆయన ఆ విధంగా అన్నారు. అసలు విషయమేమిటంటే - కర్ణాటక నుంచి బీజేపీ తరఫున రాజ్యసభకు ఎంపికైన వెంకయ్య పదవీకాలం ఈ ఏడాది జూన్30తో ముగుస్తోంది. ఇప్పటికే మూడుసార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు.
Also Read: 'జగన్ ఓర్వలేకే': మోహన్ బాబు చెప్తే.. ముద్రగడను కలిసిన హీరో విష్ణు
ఒక్కో నాయకుడికి గరిష్ఠంగా మూడుసార్లు మాత్రమే అవకాశం కల్పించే సంప్రదాయాన్ని బిజెపి పాటిస్తోంది. అసాధారణ సందర్భాల్లో మాత్రమే దీనికి మినహాయింపునిచ్చారు. ఇప్పటికే మూడు సార్లు రాజ్యసభకు ఎన్నిక చేయించినందున మళ్లీ అవకాశం కల్పించే పరిస్థితిలేదని, కర్ణాటకలోనూ పార్టీ బలహీనంగా ఉన్న నేపథ్యంలో ఆయనకు మరో అవకాశం అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు భావించారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన రాజ్యసభకు ఎంపిక కావొచ్చునని కూడా వార్తలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి మిత్రపక్షమైన టిడిపికి మూడు రాజ్యసభ సీట్లు దక్కనున్న నేపథ్యంలో ఒకటి వెంకయ్యకు ఇవ్వొచ్చునని ప్రచారం జరుగుతోంది. కానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన వెంకయ్య వేరే పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ కావటం ఆయనకు కానీ, బీజేపీకికానీ మంచిది అంటున్నారు.
అదేవిధంగా, ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య ను నామినేట్ చేయబోతున్నారంటూ వెలువడిన వార్తలను కూడా తోసిపుచ్చారు. వెంకయ్య స్థాయికి అయితే రాష్ట్రపతి అవుతారేమో తప్ప ఉప రాష్ట్రపతి మాత్రం కారన్నారు. ఉప రాష్ట్రపతి పదవివార్త లను ప్రస్తావించగా.. తాను ఉషాపతినేనని (వెంకయ్య భార్యపేరు ఉష), ఉపరాష్ట్రపతి కాబోనని ఆయన చమత్కరించారని అంటున్నారు.
కాగా, ప్రస్తుత పరిస్థితుల్లో వెంకయ్యను వదులుకునేందుకు ప్రధాని సిద్ధంగా లేరని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీజేపీ నుంచే నాలుగోసారి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈసారి మధ్యప్రదేశ్ నుంచి వెంకయ్యను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న చందన్మిత్ర పదవీకాలం ఈ ఏడాది జూన్ 29తో ముగు స్తుంది.
అద్వానీకి మిత్రా సన్నిహితుడు. దీంతో ఆయనకు అవకాశమివ్వకుంటే విమర్శలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ స్థానాన్ని వెంకయ్యతో భర్తీచేస్తే ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టవచ్చునని ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా భావిస్తున్నారని వినికిడి. వెంకయ్య నాయుడిని నామినేట్ చేస్తే అంతర్గత విమర్శలు రావనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు.