నా వల్లే తెలంగాణ, ఏపీలకు, నన్ను అనే హక్కులేదు: వెంకయ్య
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని, కేంద్రంలో నేను ఉన్నాను కాబట్టే నెలకో ప్రాజెక్ట్ వస్తోందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఢిల్లీలోని వెంకయ్య నివాసం వద్ద శుక్రవారం విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి ధర్నా చేపట్టింది.
దీనిపై వెంకయ్య నాయుడు స్పందించారు. అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ తెలుగు రాష్ట్రాలకు అధిక ప్రాజెక్టులు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలోని అనేక ఉన్నత సంస్థలు, విశ్వవిద్యాలయాలను ఏపీకి తీసుకు వచ్చానని చెప్పారు.
కేంద్రంలో నేను ఉన్నాను కాబట్టే తెలుగు రాష్ట్రాలకు నెలకు ఒక ప్రాజెక్ట్ వస్తోందని చెప్పారు. ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు చవకబారు రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. పోలవరం ఆర్డినెన్స్ సమయంలో నేతలు అలాగే ప్రవర్తించారన్నారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించలేదన్నారు.
పీకి ప్రత్యేక హోదా అంశం ఆర్థిక, హోంశాఖ పరిధిలో ఉందని తెలిపారు. ధర్నాల వల్ల ప్రచారం తప్ప ఏపీకి వచ్చేదేమీ లేదన్నారు. ప్రత్యేక హోదాపై త్వరగా కేంద్రం నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రచారం కోసమే తనను టార్గెట్ చేస్తున్నారని, తనను విమర్శించే హక్కు ఇతర పార్టీలకు లేదన్నారు.
చట్టంలో పేర్కొనని ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయంటే అందుకు తానే కారణమన్నారు. అంతకుముందు ఆందోళన చేస్తున్న విద్యార్థి జేఏసీ నేతలను అడ్డుకోవడంతో ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ వెంకయ్య నివాసం వద్ద విద్యార్థి జేఏసీ శుక్రవారం ఉదయం ఆందోళనకు దిగారు. కేంద్రప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థి నేతలు నిరసన చేపట్టారు.