వెంకయ్య కితాబు: చంద్రబాబుకు ఆ ఆర్తి ఎక్కువట!
విజయవాడ: కొంతమందికి అధికార ఆర్తి ఎక్కువగా ఉంటుందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది అభివృద్ధి ఆర్తి అని, అభివృద్ధికోసం నిరంతరం తపిస్తుంటారని కేంద్రమంత్రి వెంక్యనాయుడు అన్నారు. శుక్రవారం కృష్ణాజిల్లా సూరంపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీపెట్ సంస్థకు శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆ విధంగా కితాబు ఇచ్చారు.
ప్రజల కోసం ముందు దృష్టితో అభివృద్ధి కార్యక్రమాలవైపు చంద్రబాబు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన అన్నారు.. అందులో ఆక్షేపించాల్సిన అవసరం లేదని, కేంద్రం కూడా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుందని ఆయన అన్నారు. ఈ రోజు ధాత్రీ దివాస్ అని అంటే భూమి దినమని, ప్రతి ఒక్కరూ ప్రకృతిని పరిక్షించుకోవాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు అన్నారు.
చెట్లు నాటి, పచ్చదనాన్ని పెంచాల్సిన అవసరం ఉందని, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా నీటి కొరత ఉందని, అందరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, భూమి, నీటి పట్ల అందరూ జాగ్రత్త వహించాలని అన్నారు.
దేశం అభివృద్ధివైపు దూసుకుపోతోందని, మోడీ అంటే మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా అని వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేయాలని చంద్రబాబు కలలుకంటున్నారని చెప్పారు.అటు మోడీ, ఇటు బాబు..వీరి జోడీతో రాష్ర్టాభివృద్ధికి బాటలు వేస్తారని, వారి దృష్టంతా అభివృద్ధిపైనేనని ఆయన అన్నారు.
దైనందిన కార్యక్రమాల్లో ప్లాస్టిక్ ఉపయోగం విపరీతంగా పెరిగిందని, మెరుగైన పద్ధతుల్లో ప్లాస్టిక్ వాడకానికి సిపెట్ కృషి చేస్తుందని చంద్రబాబు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో పోలీస్ స్టేషన్లో రైతులకు యారియా పంపిణీ చేశారని, అనంతకుమార్ కృషి వల్ల ప్రస్తుతం ఎక్కడా యూరియా కొరత లేదని చెప్పారు. వ్యవసాయంలో ఇజ్రాయెల్ విప్లవం తీసుకొచ్చిందని, వ్యవసాయంలో విప్లవం సాధించాలంటే ప్లాస్టిక్ అవసరమన్నారు.
విశాఖలో బల్క్డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, అందుకోసం విశాఖలో 500 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధమని చంద్రబాబు చెప్పారు. ప్లాస్టిక్ పార్కు కోసం మల్లవల్లిలో 250 ఎకరాలు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
హేతు బద్దత లేకుండా రాష్ట్రాన్ని విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం తక్కువగా ఉంది, మన ఇబ్బందులను అర్థం చేసుకుని దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకూ కేంద్రం సాయం చేయాలని కోరారు.
ప్లాస్టిక్ను రైతులకు అనుసంధానం చేయాలని కేంద్రమంత్రి అనంతకుమార్ సూచించారు. విజయవాడ సిపెట్లో అగ్రి ప్లాస్టిక్ఇంజినీర్లు తయారవుతారన్నారు. అనంతపురంలో మరో సిపెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కోర్సును ప్రారంభిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో కేంద్రమంత్రులుఅనంతకుమార్, హన్స్రాజ్ గంగారం, రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, గన్నవరం ఎమ్మెల్యే వంశీమోహన్ తదితరులు పాల్గొన్నారు.