ప్రత్యేక హోదాపై ఎపిలో రాహుల్ ధర్నా: విహెచ్కు మెచ్చుకోలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కట్టబెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఏపీలో ధర్నా చేయాలని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నేత వి. హనుమంతరావు సూచించారు. బుధవారం రాత్రి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా పార్టీ ఎంపీలకు విందు ఇచ్చారు.
ప్రతి పార్లమెంటు సమావేశాల చివరలో ఎంపీలకు విందు ఇవ్వడం సోనియా సంప్రదాయంగా పెట్టుకున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారంతో ముగుస్తుండటంతో బుధవారం రాత్రి ఆమె ఈ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ తెలంగాణ పర్యటనపై వీహెచ్ చర్చించారు.
హైదరాబాద్ పర్యటన తేదీలను త్వరగా ఖరారు చేస్తే జిల్లాల్లో తిరిగి విద్యార్థుల్ని చైతన్యపరుస్తామని వీహెచ్ చెప్పారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కోసం ప్రజలంతా ఆందోళన చేస్తున్నారని, దీనికి మద్దతు ఇవ్వాలని రాహుల్కు సూచించారు.
ఏపీలో కూడా పర్యటించాలని, ఏదో ఒక ప్రదేశంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా చేయాలని ప్రతిపాదించారు. ఇది మంచి ప్రతిపాదన అంటూ రాహుల్ మెచ్చుకున్నట్లుగా వీహెచ్ చెప్పారు. విహెచ్ తెలంగాణకు చెందినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఎపిలో పార్టీకి పునరుజ్జీవం పోయడానికి రాహుల్ దీక్ష పనికి వస్తుందని ఆయన భావిస్తున్నారు.