ఏం పనుల్రా అవి: బీసీ మహిళ అనే కదా: విడదల రజినీ
Vidadala Rajini: కొత్త ఏడాది నాడు గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం పరిధిలో కొత్తగా నిర్మించిన మంత్రి విడదల రజిని కార్యాలయంపై తెలుగుదేశం- జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అద్దాలను పగులగొట్టారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు.
కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ పేరుతో అర్ధరాత్రి గుంటూరు వెస్ట్లో టీడీపీ- జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. విడదల రజిని కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీ రామారావు విగ్రహం వద్ద సుమారు గంటపాటు తిష్టవేశారు. వైఎస్ జగన్, విడదల రజినీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం మంత్రి కార్యాలయంలోకి దూసుకెళ్లారు. అడ్డొచ్చిన సెక్యూరిటీ సిబ్బందినీ వదల్లేదు. వారిని కొట్టారు. కార్యాలయం లోనికి దూసుకెళ్లిన అనంతరం ఫ్లెక్సీలను చించివేశారు. వాటికి నిప్పంటించారు. రాళ్లతో అద్దాలను పగులగొట్టారు. చేతికి అందిన వస్తువులను ఆఫీస్పైకి విసిరేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, వారిని చెదరగొట్టారు.
పార్టీ కార్యాలయాన్ని విడదల రజిని సందర్శించారు. కార్యాలయం మొత్తం కలియ తిరిగారు. కార్యాలయం లోపల పడ్డ రాళ్లను మీడియాకు చూపించారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. గుంటూరు వెస్ట్లో తన గెలుపు ఖాయం కావడం వల్లే టీడీపీ- జనసేన అల్లరిమూకలు ఈ దాడికి పాల్పడ్డారని విమర్శించారు.

రాళ్లను తమ వెంట తీసుకొచ్చారంటే.. ఈ దాడి మొత్తం ప్రీ ప్లాన్డేనని, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకే వారు దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. వెనుక ఎవరు ఉన్నా కూడా వదిలిపెట్టబోమనీ అన్నారు. బీసీ మహిళగా గుంటూరు ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన తనపై టీడీపీ- జనసేన కార్యకర్తలు అధికార దాహంతో భయభ్రాంతులకు గురి చేస్తోన్నారని విమర్శించారు.

ఇప్పటికే పోలీసులు కొందరని అదుపులోకి తీసుకున్నారని, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి, ఈ దాడి వెనుక ఉన్న వారి భరతం పడతామని అన్నారు. టీడీపీ- జనసేన కార్యకర్తలు తనను ఎంతగా భయభ్రాంతులకు గురి చేసిన భయపడే ప్రసక్తే లేదని, గుంటూరు వెస్ట్లో విజయం సాధిస్తానని అన్నారు.












Click it and Unblock the Notifications