Yes Bankపై కపట ప్రేమ-లూటీ: ఎక్కైడనా ‘చంద్రబాబు’ పేరే అంటూ విజయసాయి రెడ్డి సంచలనం
అమరావతి: నష్టాల ఊబిలో కూరుకుపోయిన యస్ బ్యాంక్ వ్యవహారంకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు లింక్ పెట్టారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి. చంద్రబాబు ఆ బ్యాంకును పొగినప్పుడే అవినీతి, అవకతవకలు జరిగినట్లు అర్థమైందని విమర్శించారు.
Yes Bankపై బాబుకు కపట ప్రేమ.. లూటీ చేశారు..
‘చంద్రబాబు Yes Bankను అడ్డం పెట్టుకునీ రాష్ట్రాన్ని లూటీ చేశాడు.1300 కోట్ల TTD నిధులు డిపాజిట్ చేయించి కమీషన్లు తీసుకున్నాడు. ఛైర్మన్ సుబ్బారెడ్డి గారు సకాలంలో స్పందించి డిపాజిట్లను వెనక్కుతీసుకోవడంతో ప్రమాదం తప్పింది. Yes Bankకు AP టూరిజం శాఖ నిధులనూ దోచిపెట్టాడు.ఇంకెన్ని ఉన్నాయో?' అంటూ సంచలన ఆరోపణలు చేశారు విజయసాయి రెడ్డి.
దేశంలో ఎక్కడైనా చంద్రబాబు పేరే..
‘Yes Bank పైన చంద్రబాబు అంత ప్రేమ కనబర్చారంటేనే అవతవకలు జరిగినట్టు ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ పై ఈడి కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ పై దర్యాప్తు జరుగుతోంది. దేశంలో ఎక్కడ హవాలా, లాండరింగ్ బయటపడ్డా బాబు పేరు వినిపిస్తోంది' అని విజయసాయి రెడ్డి ఆరోపించారు.
బాబూ నీదెప్పుడూ కపట ప్రేమే..
‘రిజర్వేషన్లు 50% దాటరాదని కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకున్నారు. సిఎం జగన్ గారు పార్టీ పరంగా బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 59.85% అణగారిన వర్గాలకు బి-ఫారాలు ఇస్తారు. ఈ మాట ముందే చెప్పడానికి నోరెందుకు పెగల్లేదు బాబూ. బీసీలపై నీదెప్పుడూ కపట ప్రేమే కదా!' అంటూ విజయసాయి రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని 1.62 కోట్ల కుటుంబాలకు సంక్షేమ సాయం అందింది. ఏటా 16 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చినా సిఎం జగన్ గారు వెనకడుగు వేయలేదు. నీ జమానాలో ప్రజలను ఈ విధంగా ఆదుకునే ప్రయత్నం చేశావా? సంతృప్త స్థాయిలో ఏ పథకమైనా అమలు చేశావా? ఎలక్షన్లకు ముందు ప్రలోభ పెట్టడం తప్ప అని మండిపడ్డారు.
Recommended Video
నష్టాల ఊబిలో యస్ బ్యాంక్.. ఆంక్షలు
కాగా, దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకులలో ఒకటైన యస్ బ్యాంక్ నష్టాల ఊబిలో కూరుకుపోవడంతో కేంద్ర ప్రభుత్వం సదరు బ్యాంక్ కార్యకలాపాలను తన ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆర్బీఐ కూడా రంగంలోకి దిగి యస్ బ్యాంక్ నిర్వహణ బోర్డును రద్దు చేసి కొత్త సీఈవోను నియమించింది. ఆ బ్యాంకు ఖాతాదారులు నెలకు రూ. 50వేలకు మించి విత్ డ్రా చేసుకోవడంపై ఆంక్షలు కూడా విధించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు యస్ బ్యాంకుతో లింక్ పెట్టి విజయసాయి రెడ్డి విమర్శలు చేయడం సంచలనంగా మారింది.