విజయసాయిరెడ్డి తేల్చి చెప్పేసారు: కేబినెట్ కంటే ముందుగానే: ఇక లాంఛనమేనా!
ఏపీలో రాజధాని వ్యవహారం సున్నితంగా మారుతోంది. అమరావతి ప్రాంతంలో రైతులు మొదలు న్యాయవాదుల వరకు ఆందోళనలు చేస్తున్నారు. ఇదే సమయంలో శుక్రవారం జరిగే కేబినెట్ సమావేశంలో అన్ని అంశాలను చర్చించి..తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. కేబినెట్ లో అధికారిక నిర్ణయం జరగక ముందే వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి రాజధాని వ్యవహారం పైన తేల్చి చెప్పేసారు. ఈ నెల 28న సీఎం విశాఖ పర్యటన గురించి అధికారులతో సమీక్షించారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన తర్వాత తొలిసారి జగన్ పర్యటించనున్నారని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే జీఎన్ రావు కమిటీ నివేదిక కంటే ముందుగానే సీఎం మూడు రాజధానులు అంటూ ఇచ్చిన సంకేతాల పైన రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ విశాఖను పరిపాలనా రాజధాని చేయాలని ఆలోచన ఉన్నా..కేబినెట్ లో ఆమోదం పొందిన తరువాతనే అధికారిక నిర్ణయం. దీంతో..ఇప్పుడు విజయ సాయిరెడ్డి వ్యాఖ్యల పైన చర్చ మొదలైంది.

విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ..
ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 28న విశాఖ పర్యటన పైన రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి అధికారులతో సమీక్షించారు. సీఎం రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. విశాఖను ఎగ్జిక్యూ టివ్ క్యాపిటల్గా ప్రకటించిన తర్వాత తొలిసారి జగన్ పర్యటించనున్నారని.. ఈ నెల 28న నగరానికి వస్తున్నారని ఆయన తెలిపారు. దాదాపు 3 గంటల పాటు జగన్కు స్వాగత కార్యక్రమాలు ఉంటాయని.. చరిత్రలో నిలిచిపోయేలా స్వాగత కార్యక్రమం ఉంటుందన్నారు.
24 కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహిస్తామన్నారు. నిర్ణయం జరిగే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నా.. కేబినెట్ సమావేశం లో నిర్ణయం తీసుకొనే వరకూ అది అధికారికం కాదు. ఇదే సమయంలో విజయ సాయిరెడ్డి ముందుగానే ఈ విషయాన్ని అంత ఖచ్చితంగా చెప్పటం పైనే ఇప్పుడు చర్చ మొదలైంది. అమరావతిలో ఆందోళనలు సాగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ఎవరైనా వస్తే కేసులు పెట్టండి..
విశాఖలో భూముల వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలను విజయ సాయిరెడ్డి ఖండిచారు. ఇప్పటి వరకు ఏ విషయంలోనూ అధికారులతో తాను పైరవీలు చేయలేదన్నారు. తన పేరుతో ఎవరైనా వస్తే క్రిమినల్ కేసులు పెట్టండని అధికారులకు సూచించారు. భూదందాలపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు చేశామన్న ఆయన.. గతంలో భూదందాలు ఎవరు చేశారో తనకు తెలుసన్నారు.
ల్యాండ్ సెటిల్మెంట్లలో తన పాత్ర లేదని... తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో తనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి ఆస్తులు లేవన్నారు. ఏ వెంచర్లో కూడా భాగస్వామ్యం లేదని తేల్చి చెప్పారు. ఇక, ఇప్పుడు విజయ సాయిరెడ్డి వ్యాఖ్యల ద్వారా కేబినెట్ లో పరిపాలనా రాజధానిగా విశాఖకు ఆమోదం లాంఛనమే అనే వాదన మొదలైంది.












Click it and Unblock the Notifications