జగన్ బండారం బయటపడకూడదని, కొడుకు కోసం వైఎస్ విజయమ్మ ఆరాటం : టార్గెట్ చేస్తున్న టీడీపీ
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై కొనసాగుతున్న విమర్శల నేపథ్యంలో మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారో వారిని కచ్చితంగా శిక్షించాలని వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. ఇది తాను, సీఎం జగన్, షర్మిల చెబుతున్న మాట అని, ఇందులో రెండు అభిప్రాయాలు లేవని పేర్కొన్నారు. అయితే విజయమ్మ బహిరంగ లేఖపై టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
కొడుకు జగన్ తప్పును కప్పి పుచ్చటం కోసం లేఖల పేరుతో విజయమ్మ ఆరాటం
కొడుకు జగన్ మోహన్ రెడ్డి చేసిన తప్పును కప్పి పుచ్చుకోవటం కోసం లేఖల పేరుతో వై.ఎస్.విజయమ్మ ఆరాటపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విమర్శలు గుప్పించారు. తన తండ్రిని చంపిన వారిని శిక్షించాలని గత రెండేళ్లుగా సునీత రెడ్డి చేస్తున్న పోరాటం విజయమ్మకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. విజయమ్మ తన బహిరంగ లేఖలో వైయస్ వివేకా హత్య కేసు పై వార్తలు రాసిన మీడియాను తప్పు పట్టడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
హత్యకేసు విచారణపై విజయమ్మ జగన్ ను నిలదీయాలన్న టిడిపి ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు
వివేకా హత్య కేసులో న్యాయం చెయ్యని జగన్మోహన్ రెడ్డి ని వదిలిపెట్టి , వాస్తవాలు రాస్తున్న మీడియాను తప్పుపట్టడం సరికాదని విమర్శించారు.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులను కాపాడుతున్నందుకు విజయమ్మ జగన్ ను నిలదీయాలని టిడిపి ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో సీఎం జగన్ బండారం ఎక్కడ బయట పడుతుందోనని భయంతోనే కొడుకుని కాపాడుకోవడం కోసం విజయమ్మ లేఖలు రాస్తున్నారని సత్యనారాయణ రాజు విమర్శించారు.
విజయమ్మ లేఖపై వివేకా హత్యపై మండిపడిన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి
ఇదే సమయంలో విజయమ్మ లేఖపై టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ కూడా స్పందించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్ ఒక చెల్లిని మోసం చేసిన హైదరాబాద్ పంపించి, మరో సోదరిని ఢిల్లీలో వదిలేశారని మండిపడ్డారు. ఆనాడు చంద్రబాబు హయాంలో సిబిఐ విచారణ కావాలన్న జగన్ ఇప్పుడు సీబీఐ విచారణను ఎందుకు ముందుకు కదలనివ్వడంలేదని ప్రశ్నించారు. సిట్ విచారణ వేగంగా జరుగుతుంటే దానిని అడ్డుకుంది జగన్ కాదా అంటూ సూర్యప్రకాష్ నిలదీశారు.
విజయమ్మ లేఖపై టీడీపీ నేతల విమర్శలు .. ఏపీలో తెరమీదకు వైఎస్ వివేకా హత్యకేసు
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై ఏపీ టీడీపీ నేతలు జగన్ ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్న క్రమంలో , వైయస్ విజయమ్మ రాసిన బహిరంగ లేఖ ఏపీలో హాట్ టాపిక్ కాగా , విజయమ్మ లేఖపై సైతం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒక పక్క తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికల నేపధ్యంలో ప్రతిపక్ష పార్టీలు జగన్ బాబాయ్ అయిన వైఎస్ వివేకా హత్యకేసును ప్రస్తావిస్తూ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటే ఈ విమర్శలపై విజయమ్మ స్పందించటం ఏపీలో చర్చనీయాంశం అయింది .