‘టిడిపిని జాతీయ పార్టీగా ప్రకటించడం హాస్యాస్పదం’
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నానిలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించుకోవడం, దానికి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడును ప్రకటించడం హాస్యాస్పదమని అన్నారు. శనివారం కృష్ణాజిల్లా గుడివాడలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో విజయసాయిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని, ఎమ్మెల్సీ అభ్యర్థి జి అదిశేషగిరిరావు సమావేశమయ్యారు.
అవినీతి గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడటం బాధగా ఉందని విజయసాయిరెడ్డి అన్నారు. స్వదేశీ సంపదను హవాలా రూపంలో సింగపూర్ తరలించి అక్కడ హోటళ్లు నిర్మించిన ఘనత చంద్రబాబుదని తెలిపారు. అవినీతి గురించి ప్రశ్నించే ముందు తనను తాను ప్రశ్నించుకోవాలని చంద్రబాబుకు విజయసాయిరెడ్డి హితవు పలికారు.

అవినీతి ఆస్తులు పంచుతాననడం సంతోషమే, కానీ ముందు తను తరలించిన హవాలా ఆస్తులను రాష్ట్ర ప్రజలకు పంచాలని ఆయన చంద్రబాబుకు సూచించారు. తెలుగుదేశం మహానాడులో చంద్రబాబు శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డిపై విధంగా స్పందించారు.
జూన్ 3,4 తేదీల్లో మంగళగిరిలో జరగనున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న సమర దీక్షను విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలు, ప్రజలకు సూచించారు. ఈ సమావేశంలో కొడాలి నాని మాట్లాడుతూ... టిడిపి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.
టిడిపి జాతీయ పార్టీ కాదు... ఉప ప్రాంతీయ పార్టీనే అని కొడాలి నాని స్పష్టం చేశారు. కల్లబొల్లి మాటలతో రైతులను, మహిళలను బాబు మోసం చేసి అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు ఎన్నికలు వస్తే ఆయనకు డిపాజిట్లు కూడా దక్కవని కొడాలి నాని అన్నారు.












Click it and Unblock the Notifications