విజయవాడలో 7న వైసీపీ జయహో బీసీ మహాసభ- పోస్టర్ విడుదల-చేసింది చెప్పుకునేందుకే...
ఈ నెల 7వ తేదీన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న "జయహో బీసీ మహా సభ" ఏర్పాట్లను సీనియర్ నేతలు, మంత్రులు ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా "జయహో బీసీ మహా సభ-వెనుకబడిన కులాలే వెన్నెముక.. అన్న నినాదంతో" బీసీ మహా సభ పోస్టర్ ను పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు విడుదల చేశారు. 84వేల మందికి పైగా బీసీ ప్రజా ప్రతినిధులు హాజరయ్యే ఈ మహా సభను విజయవంతం చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు వరకు ఆయా పదవుల్లో ఉన్న ప్రతి ఒక్క బీసీ ప్రజాప్రతినిధి తప్పనిసరిగా ఈ సభకు హాజరుకావాలని, ఒకవేళ ఎవరికైనా ఆహ్వానాలు అందకపోయినా, ఇదే ఆహ్వానంగా భావించి సభకు రావాలని సాయిరెడ్డి కోరారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జయహో బీసీ పేరుతో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ బీసీ మహాసభ నిర్వహిస్తోందని, వెనుకబడిన వర్గాలే వెన్నెముక.. అన్న నినాదంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 7వ తేదీన మహాసభ జరుగుతుందని సాయిరెడ్డి తెలిపారు. 7వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ మహాసభ ప్రారంభం అవుతుందన్నారు. 12 గంటలకు ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారన్నారు.
డిసెంబర్ 7న విజయవాడలో జరగనున్న జయహో బీసీ మహాసభ పోస్టర్ను ఆవిష్కరించిన వైఎస్ఆర్ సీపీ నేతలు. #YSJaganForBCWelfare pic.twitter.com/HpRCXstL1v
— YSR Congress Party (@YSRCParty) December 1, 2022
ఈ మూడున్నరేళ్ల కాలంలో ఈ ప్రభుత్వం బీసీలకు ఏం చేసింది, రాబోయే కాలంలో ఏం చేయబోతుంది అనేది ముఖ్యమంత్రి వివరిస్తారని సాయిరెడ్డి తెలిపారు. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ పదవులు పొందిన ప్రతి ఒక్క బీసీ ప్రతినిధినీ ఈ సభకు ఆహ్వనిస్తున్నట్లుసాయిరెడ్డి వెల్లడించారు. ఈ సమావేశాల అనంతరం రీజనల్ స్థాయిలో జోనల్ సమావేశాలు కూడా నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి సమావేశాలు, ప్రణాళిక బద్దంగా బీసీ సభలు నిర్వహిస్తామన్నారు. జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం లోపల ఈ సమావేశాలన్నింటినీ పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు.
విజయవాడలో ఈనెల 7న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే "వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయహో బీసీ-వెనుకబడిన కులాలే వెన్నెముక" సభా వేదిక ఏర్పాట్లను మంత్రులు శ్రీ జోగి రమేష్, శ్రీ చెల్లుబోయిన వేణుగోపాల్, శ్రీ కారుమూరి నాగేశ్వరరావు, అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. pic.twitter.com/e7aO7J758p
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 1, 2022
అధికారానికి ఒక ఆకారం ఉంటుందా.. పదవులు పొందిన బీసీలకు అధికారాలు లేవన్న విమర్శలు హాస్యాస్పదం. అదంతా ఎల్లో మీడియా సృష్టేనని మంత్రి బొత్స తెలిపారు. ప్రతిపక్షాలు కూడా అలాంటి విమర్శలు చేయడం బీసీలను కించపరచినట్లే అవుతుందన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న, అణగారిన వర్గాలకు జగన్ అండగా నిలిచారని, ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల వారికి మేమున్నాం అనే ధైర్యాన్ని, భరోసాను ఇవ్వడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. బీసీ మహాసభ తర్వాత ఎస్సీ, ఎస్టీల సభలు కూడా నిర్వహిస్తామన్నారు. ఎవరినో విమర్శించడానికి ఈ బీసీ సభలు పెట్టడం లేదన్నారు. విమర్శలు చేసే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క బీసీ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాది అనే రీతిలో మేం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
బాబు ఇదేం ఖర్మ అని తిరుగుతుంటే.. జనం చంద్రబాబుకు ఇదేం ఖర్మా.. అని ఎదురు ప్రశ్నిస్తున్నారని మరో మంత్రి జోగి రమేష్ తెలిపారు. చంద్రబాబు ఖర్మ పట్టి తిరుగుతున్నాడని, 84 వేల మంది బీసీ ప్రతినిధులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడలో జయహో బీసీ అంటూ ఒక మహాసభ నిర్వహిస్తుంటే.. టీడీపీ వెన్నులో వణుకుపుడుతుందన్నారు. బీసీలను చంద్రబాబు అన్నివిధాలా ముంచాడని, జగన్ అధికారంలోకి వచ్చాక బీసీలకు పెద్దపీట వేసి, సామాజిక న్యాయం చేస్తున్నారన్నారు. ఈ సభలో గడిచిన మూడున్నరేళ్ళలో జగన్ నాయకత్వంలో తమ ప్రభుత్వం బీసీలకు ఏం చేసింది. బీసీలకు ఏం చేస్తామని చెప్తామన్నారు.