విజయసాయి దెబ్బ, బుట్టా రేణుక పేరు తొలగింపు! ఆమె పేరు ఎందుకు వచ్చింది?
అమరావతి/న్యూఢిల్లీ: 2014లో వైసీపీ నుంచి గెలిచి పార్టీ మారిన బుట్టా రేణుకను డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఆహ్వానించడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. దీనిపై ఆయనకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నుంచి సమాధానం కూడా వచ్చింది.
వైసీపీ ఫ్లోర్ లీడర్గా బుట్టా రేణుక: అందుకేనని విజయసాయి ఆగ్రహం
కానీ దీనిపై ఆయన సంతృప్తి చెందలేదు. ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఫిర్యాదు చేసారు. వైసీపీ ప్రశ్నలు, ప్రధాని మోడీకి ఫిర్యాదు నేపథ్యంలో బోర్డులో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా బుట్టా రేణుకను పిలుస్తున్నట్లుగా ఉన్న పేరును తొలగించారు. దీనిపై విజయసాయి మాట్లాడారు.
అలా సమర్థించుకున్నారు
పార్టీ మారిన బుట్టా రేణుకపై అనర్హత వేటు వేయాలని లోకసభ స్పీకర్కు తాము అనేకసార్లు ఫిర్యాదు చేశామని విజయసాయి రెడ్డి చెప్పారు. అనర్హత వేటుపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా పిలిచామని సమర్థించుకున్నారని విమర్శించారు.
విజయసాయి రెడ్డి విమర్శలతో రేణుక పేరు తొలగింపు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక లేఖ ఇవ్వకుండానే ఆమెను ఆహ్వానించడం తప్పు అని విజయ సాయి రెడ్డి అన్నారు. కాగా, అఖిల పక్షానికి వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా బుట్టా రేణుకను ఆహ్వానిస్తూ బోర్డు ఏర్పాటు చేశారు. విజయసాయి రెడ్డి హెచ్చరికలతో ఆహ్వానం బోర్డును అధికారులు తొలగించారు. రేణుకకు ఆహ్వానం నిర్ణయాన్ని విజయసాయి ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకు వెళ్లారు.
ఏం సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్న
బుట్టా రేణుకను ఫ్లోర్ లీడర్గా ఆహ్వానించడంపై ఏం సంకేతాలు ఇస్తున్నారని విజయ సాయి రెడ్డి ప్రశ్నించారు. ఆమెను ఆహ్వానించడం ద్వారా బీజేపీ, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు రాజకీయాలు తేలిపోయాయని చెప్పారు. కాగా, ఆమె అప్పటికి హైదరాబాదులోనే ఉన్నారు. బుధవారం నాటి పార్లమెంటు సమావేశాలకు ఆమె ఆ తర్వాత బయలుదేరారు. మంగళవారం బోర్డు నుంచి ఆమె పేరును తొలగించారు.
లోకసభ సెక్రటరీ వద్ద జరిగిన పొరపాటా, కావాలని చేశారా?
ఇదిలా ఉండగా, వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఆమె పేరు ఎందుకు వచ్చిందనే అంశంపై అంతర్గతంగా విచారిస్తున్నారని తెలుస్తోంది. లోకసభ సెక్రటరీ వద్ద జరిగిన పొరపాటా లేక కావాలని చేశారా అనే చర్చ సాగుతోంది. ఆమె పేరు రావడంపై వైసీపీ మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉంది.