సాయిరెడ్డి అడుగులు ఎటు - జగన్ ఆ నిర్ణయంతో, ఇక..!!
వైసీపీలో ఏం జరుగుతోంది. ఓటమి తరువాత ముఖ్య నేతలు ఎక్కడ. జగన్ ఓటమి పైన పార్టీ నేతలతో సమీక్షలు చేసారు. పార్టీ భవిష్యత్ గురించి భరోసా కల్పించే ప్రయత్నం చేసారు. జిల్లాల పర్యటనలకు జగన్ సిద్దం అవుతున్నారు. పార్టీ నెంబర్ టూ నుంచి వరుసగా ఉన్న ముఖ్య నేతల తీరు ఇప్పుడు సందేహాలకు కారణమవుతోంది. పార్టీ ముఖ్య నేత సాయిరెడ్డి మౌనంగా ఉంటున్నారు. జగన్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో కోటరీ నేతల మధ్య గ్యాప్ కు కారణంగా కనిపిస్తోంది.
వైసీపీలో కోల్డ్ వార్
వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ తో ముగ్గురు ముఖ్యులు కీలకంగా వ్యవహరించారు. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వంలో సజ్జల, ఢిల్లీలో సాయిరెడ్డి, పార్టీ వ్యవహారాల్లో వైవీ సుబ్బారెడ్డి తమ హవా కొనసాగించారు. సాయిరెడ్డికి తొలుత ఉత్తరాంధ్ర, ఆ తరువాత నెల్లూరు -ప్రకాశం బాధ్యతలను జగన్ కేటాయించారు. రెండు సార్లు టీటీడీ ఛైర్మన్ గా చేసిన వైవీ సుబ్బారెడ్డి ఎన్నికల సమయంలో ఉత్తరాంధ్ర బాధ్యతలు చూసారు. సజ్జల ప్రభుత్వం - పార్టీకి అనుసంధాన కర్తగా వ్యవహరించి...ఫలితాల తరువాత సొంత పార్టీ నేతల విమర్శలు ఎదుర్కొన్నారు.

జగన్ నిర్ణయంతో
ఇక, వేమిరెడ్డి పార్టీ వీడటంతో సాయిరెడ్డి చివరి నిమిషంలో వైసీపీ నెల్లూరు అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇదే సమయంలో వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఎన్నికల ఫలితాల తరువాత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటరీ పార్టీ నేతగా వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. అప్పటి వరకు ఆ హోదాలో ఉన్న సాయిరెడ్డిని రాజ్యసభ పక్షనేతగా పరిమితం చేసారు. అప్పటి వరకు సాయిరెడ్డి - లోక్ సభ పక్షనేతగా మిథున్ రెడ్డి మిగిలిన ఎంపీలతో సమన్వయం చేసుకొనే వారు. వైవీకి కొత్త బాధ్యతలతో సాయిరెడ్డి అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు.
సాయిరెడ్డి ఆలోచన ఏంటి
పార్లమెంట్ సమావేశాల సమయంలోనూ పార్టీ ఎంపీల మధ్య ఐక్యత కనిపించ లేదు. కేంద్రం -వైసీపీ మధ్య సత్సంబంధాల్లో కీలకంగా వ్యవహరించిన తనను కాదని...సుబ్బారెడ్డికి పార్లమెంటరీ పార్టీ నేతగా ఖరారు చేయటంతోనే సాయిరెడ్డి మౌనంగా ఉంటున్నారనే చర్చ మొదలైంది. తరచూ సోషల్ మీడియా వేదికగా టీడీపీ పైన విమర్శలు చేసే సాయిరెడ్డి..కూటమి ప్రభుత్వ నిర్ణయాల పైన ఎక్కడా స్పందించటం లేదు. పార్టీ కష్టంలో సాయిరెడ్డి వ్యవహార శైలి గురించి కేడర్ లో చర్చ కొనసాగుతోంది. దీంతో...అసలు సాయిరెడ్డి అడుగులు ఎటు..ఆయన ఆలోచన ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications