'చంద్రబాబు అంటే కుక్క అంటే కుక్క,నక్క అంటే నక్క.. అమరావతి ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం'
ఆంధ్రప్రదేశ్కు ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించడంపై అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. అభివృద్ది వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతుండగా.. ప్రపంచంలో మూడు రాజధానులు సక్సెస్ అయిన దాఖలా లేదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శిస్తున్నారు. దేశంలోని మిగతా రాజధానులతో పోలిస్తే అమరావతిలో నిర్మాణాలకు అయ్యే ఖర్చు తక్కువని అసెంబ్లీలో ఆయన చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు.

విజయసాయి ఏమన్నారు..
'అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రమోషన్ కోసం ఏటా స్విట్జర్లాండ్ లోని దావోస్ సదస్సుకు వెళ్లేవాడు చంద్రబాబు. చిట్టినాయుడు కూడా ప్రత్యేక విమానాల్లో తిరిగొచ్చేవాడు. జపాన్, సింగపూర్, చైనా, కజకిస్థాన్, మలేసియా, థాయిలాండ్ లకు లెక్కలేనన్ని సార్లు పర్యటనలు చేశారు.' అంటూ విజయసాయిరెడ్డి ఆరోపించారు.

చంద్రబాబు కుక్క అంటే కుక్క..
'అమరావతికి వరద ముప్పు లేదంట. రేగడి నేలలైనా భారీ నిర్మాణాలకు అనుకూలమే అని చెప్పడానికి ఎల్లో మీడియా పడరాని పాట్లు పడుతోంది. చివరకు కోల్కతా, ముంబై నగరాలు ప్రమాదకరమైనవని తీర్పు చేప్పే సాహసానికి తెగబడింది.' అని విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు నక్క అంటే నక్క, కుక్క అంటే కుక్క అనడమే పచ్చ మీడియా పని అని ఘాటు విమర్శలు చేశారు.

ఇంతకీ చంద్రబాబు ఏమన్నారు..
మూడు రాజధానుల బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్,ముంబై,కోల్కతా,చెన్నై వంటి నగరాలతో పోలిస్తే అమరావతిలో నిర్మాణాలకు అయ్యే ఖర్చు తక్కువన్నారు. ఈ మేరకు కమిటీలు రిపోర్ట్ కూడా ఇచ్చాయన్నారు. హైదరాబాద్ లాంటి చోట్ల 30 అడుగుల మేర పునాదులు తవ్వాల్సి ఉంటుందని అన్నారు. అదే అమరావతిలో అయితే నేల పటుత్వం ఎక్కువని,అంత లోతుకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్,ముంబై లాంటి నగరాలతో పోలిస్తే అమరావతి నేలకు పటుత్వం ఎక్కువని చెప్పడాన్ని తప్పు పట్టారు.

కమిటీ కూడా అదే చెప్పిందన్న చంద్రబాబు..
శివరామకృష్ణన్ కమిటీ రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పలేదన్న చంద్రబాబు.. ప్రజాభిప్రాయం,సమదూరం విషయంలో కృష్ణా-గుంటూరు మధ్య రాజధాని నిర్మాణం ఉత్తమం అని కమిటీ సూచించినట్టుగా అసెంబ్లీలో పేర్కొన్నారు.అంతేకాదు,అమరావతి నేల నిర్మాణాలకు అనువైందని ఐఐటీ చెన్నై నివేదిక కూడా ఇచ్చిందన్నారు. డబ్బులు లేవని రాజధాని తరలించడం సరికాదని,వయసులో చిన్నవాడైనా జగన్కు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నానని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఏదేమైనా అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పాసైంది. మండలిలో టీడీపీ సభ్యుల బలం ఎక్కువ ఉన్నందునా.. వైసీపీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications