విజయవాడలో దారుణం.. బాలుడి కిడ్నాప్, హత్య.. బెట్టింగ్ వ్యవహారమే కారణమా?
విజయవాడలోని కృష్ణలంకలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలుడు(8)ని కిడ్నాప్ చేసిన నిందితులు అతడి తల్లిదండ్రులను డబ్బు డిమాండ్ చేశారు. వారు ఇవ్వలేకపోవడంతో ఆ బాలుడ్ని హత్య చేశారు.
విజయవాడ: విజయవాడలోని కృష్ణలంకలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలుడు(8)ని కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేశారు. మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం.. డబ్బులిస్తే వదిలేస్తాం.. అంటూ నిందితులు తమను డిమాండ్ చేశారని బాలుడి తల్లిందడ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులకు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.
కిడ్నాప్ చేసిన ఆ బాలుడిని చంపి, అతడి మృతదేహన్ని గోనెసంచిలో కట్టి పూడ్చివేసినట్లు నిందితులు తెలిపారు. అనంతరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాలుడి మృతదేహన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఈ దారుణానికి కారణం బెట్టింగ్ వ్యవహారంగా తెలుస్తోంది. బెట్టింగ్ కు అలవాటు పడి.. డబ్బు కోసం ఆ బాలుడిని కిడ్నాప్ చేసి అతడి తల్లిదండ్రులను బ్లాక్ మెయిల్ చేసినట్లు నిందితులు పేర్కొన్నారు. నిందితులిద్దరిలో ఒకరు ఇంటర్మీడియెట్ విద్యార్థి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.