తాత్కాలిక రాజధానిగా విజయవాడ సిద్దమౌతోందిలా..!
హైదరాబాద్: తాత్కాలిక రాజధానిగా విజయవాడ వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు ఇటీవలె విజయవాడలో పలు అంశాల పైన స్పష్టత ఇచ్చారు. తాజాగా మంత్రి పీ నారాయణ విజయవాడలో పరిశీలించారు. మంత్రులు కూడా తమ కార్యాలయాలను నెలకొల్పే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఇప్పటికే విజయవాడ - గుంటూరు - తెనాలితో పాటు మరో మూడు కారిడార్లతో పాటు మెట్రో రైలు ఏర్పాటుకు కేంద్రం స్పష్టతను ఇచ్చింది. రూ.25 కోట్లతో పూర్తిస్థాయి నివేదిక తయారీకి 'ఉడా' టెండర్లను ఆహ్వానించింది. గన్నవరం విమానాశ్రయాన్ని ఏఏఐ చైర్మన్ ఇటీవల సందర్శిచి విస్తరణకు సానుకూలత వ్యక్తం చేశారు.
వీజీటీఎం - ఉడా పరిధిలో 186 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చంద్రబాబు వెల్లడించారు. రాజధాని అవసరాలకు 30 టీఎంసీల నీటిని కేటాయించాలని కోరారు. మంగళగిరి సమీపంలో ఎయిమ్స్, గుంటూరు వద్ద అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. డీజీపీ కార్యాలయం మంగళగిరిలో ఏర్పాటు కానుంది.
కృష్ణా జిల్లా బావులపాడు మండలంలోని మల్లపల్లిలో 1400 ఎకరాల్లో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందేలా టౌన్ షిప్ నిర్మించాలని భావిస్తున్నారు. ఇందులో అన్నింటికి సదుపాయాలు కల్పించాలని చూస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో పన్నెండు ఎకరాల్లో రూ.50 కోట్లతో అంతర్జాతీయ కన్వెన్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఉడా ప్రతిపాదించింది.
అలాగే, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఒకే ఆవరణలో ఏర్పాటు చేసేందుకు రూ.125 కోట్లతో గ్రీన్ బిల్డింగ్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డులోని రెండెకరాల ప్రభుత్వ స్థలంలో పది అంతస్తులతో భవనం నిర్మించాలనే ఆలోచన ఉంది. చెరువులను కూడా అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.