బెజవాడ బీజేపీలో అసలేం జరిగింది?: కన్నీళ్లు పెట్టుకున్న నగర అధ్యక్షుడు
అమరావతి: ఏపీ బీజేపీలో నామినేటెడ్ పదవుల చిచ్చు వివాదానికి దారితీస్తోంది. బెజవాడ నగర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న దాసం ఉమామహేశ్వరరాజుపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. నామినేటెడ్ పదవుల కోసం ఆయన పార్టీ వ్వతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని సుమోటోగా స్వీకరించి పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ప్రకటించారు.
ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్మల శ్యాంకిషోర్ మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని, నామినేటెడ్ పదవులు అడిగితే సస్పెండ్ చేస్తారా? అంటూ దాసం అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంతటితో ఆగకుండా కంభంపాటి హరిబాబుకు వ్యతిరేకంగా మంగళవారం కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నగరానికి చెందిన డివిజన్ల అధ్యక్షులు హాజరయ్యారు. ఉమామహేశ్వరరాజును సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఉమామహేశ్వరరాజునే నగర అధ్యక్షుడిగా కొనసాగిస్తూ మరో తీర్మానం ప్రవేశపెట్టారు.
ఈ తీర్మానాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపాలని కూడా నిర్ణయించారు. మరోవైపు తన సస్పెన్షన్పై ఉమామహేశ్వరరాజు మంగళవారం మీడియాతో మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా పార్టీ కోసం అవిశ్రాంతంగా పని చేసిన తనను ఏకపక్షంగా సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు.
తనను విజయవాడ నగర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎలాంటి విచారణ లేకుండా, కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వలేదని వెల్లడించారు. బెజవాడలో పార్టీ వేళ్లూనుకోని రోజుల్లో కేవలం నాలుగు ఓట్ల మెజారిటీతో డివిజన్ నేతగా విజయం సాధించానన్నారు.
ఆ తర్వాత ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించానన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసిన విజయవాడ నగర బీజేపీ ప్రధాన కార్యదర్శి జమ్మూ శ్యాం కిషోర్ మాటలు నమ్మి తనపై సస్పెన్షన్ విధించడం సరికాదన్నారు. తాను సెలెక్టెడ్ అధ్యక్షుడ్ని కాదని, ఎలెక్టెడ్ అధ్యక్షుడినని అన్నారు.

అలాంటి తనను తీసేస్తాం, ఏకపక్షంగా సస్పెండ్ చేస్తామనడం సరి కాదని ఆయన చెప్పారు. ఏపీకి కొత్త అధ్యక్షుడు ఎన్నికైన తరువాత ఆయన ఆదేశాల ప్రకారం పని చేస్తానని ఆయన తెలిపారు. డివిజన్ అధ్యక్షులంతా కలిసి తనను ఎన్నుకున్నారన్నారు.
పార్టీ అధిష్ఠానానికి చాలా సార్లు మెయిల్స్ పంపానని, పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత తమ అందరిపై ఉందని అన్నారు. అలా చూడలేని పక్షంలో పార్టీకే నష్టమని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications