Vijayawada : విజయవాడ సిటీ పోరు ఖరారు ! వైసీపీ అభ్యర్ధులు వీరే-ప్రత్యర్ధులూ రెడీ ?
రాష్ట్రంలో రాజకీయంగా ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా అత్యంత ఆసక్తి రేపే నియోజకవర్గాల్లో విజయవాడ నగర పరిధిలోని మూడు నియోజకవర్గాలు కూడా ఉంటాయి. వీటిలో పోటీ చేసే అభ్యర్ధులు, వారి ప్రత్యర్దులపైనా చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా వీటిపై చర్చ ప్రారంభమైంది. విజయవాడ పరిధిలోకి వచ్చే తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్ధులు నిన్న ఖరారయ్యారు. విపక్ష టీడీపీ, జనసేన అభ్యర్ధులు కూడా దాదాపు ఖరారైపోయారు. దీంతో పోటీ రసవత్తరంగా మారబోతోంది.
విజయవాడ పశ్చిమ, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్ధుల్ని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ప్రకటించారు. ఇందులో విజయవాడ పశ్చిమ సీటు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను అభ్యర్ధిగా ప్రకటించారు. అలాగే విజయవాడ తూర్పు సీటులో దేవినేని అవినాష్ ను తొలిసారి అభ్యర్ధిగా ప్రకటించారు. విజయవాడ సెంట్రల్ సీటులో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును మరోసారి అభ్యర్ధిగా ఎంపిక చేశారు.

అలాగే వీరికి ప్రత్యర్ధులుగా పోటీ చేయబోతున్న టీడీపీ, జనసేన అభ్యర్ధులు కూడా దాదాపు ఖరారయ్యారు. విజయవాడ పశ్చిమ సీటులో టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా జనసేన అభ్యర్ధిగా పోతిన మహేష్ బరిలోకి దిగే అవకాశముంది.. అలాగే విజయవాడ సెంట్రల్ సీటులో టీడీపీ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు బరిలోకి దిగబోతున్నారు. అటు విజయవాడ తూర్పు సీటులో టీడీపీ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పోటీ చేయబోతున్నారు. వీరి పేర్లను ఆయా పార్టీలు దాదాపుగా ఖరారు చేసేశాయి. ప్రకటన రావడమే తరువాయిగా చెప్తున్నారు.
మరోవైపు విజయవాడ ఎంపీ సీటులో మాత్రం వైసీపీ అభ్యర్ధి ఇంకా ఖరారు కాలేదు. టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని మరోసారి పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఆయన స్ధానంలో సోదరుడు కేశనేని చిన్నికి అవకాశం కల్పించేందుకు టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. అలాగే టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా ఈ సీటును టీడీపీకి వదిలేసేందుకు జనసేన సిద్ధంగానే ఉంది. రాష్ట్రంలో రాజధానుల నేపథ్యంలో మారుతున్న పరిణామాలు ఈసారి ఇక్కడ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications