ఆ 11 కోట్లపై మరో ట్విస్ట్..! సిట్, ఎస్బీఐకి విజయవాడ కోర్టు కీలక ఆదేశం..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని చెబుతున్న మద్యం స్కాం కేసు దర్యాప్తులో భాగంగా సిట్ హైదరాబాద్ లో సీజ్ చేసిన 11 కోట్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ డబ్బు మద్యం స్కాం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డిదేనని సిట్ చెప్తుండగా.. దానికీ, తనకూ ఎలాంటి సంబంధం లేదని ఏసీబీ కోర్టులో ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ డబ్బును విజయవాడ మాచవరం ఎస్బీఐ బ్రాంచ్ లో డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత మరో ట్విస్ట్ ఎదురైంది.
సిట్ స్వాధీనం చేసుకున్న 11 కోట్లు తనవేనని ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ నోట్ల కట్టలపై నంబర్లను ప్రత్యేకంగా నమోదు చేసి డిపాజిట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఏ1 నిందితుడు రాజ్ కెసిరెడ్డి ఏసీబీ కోర్టును కోరారు. దీనిపై ఇవాళ కోర్టు విచారణ జరిపింది. కెసిరెడ్డి దాఖలు చేసిన మెమోలో సరైన వీడియోగ్రఫీ లేకుండా నగదును డిపాజిట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేయడంతో దీనిపై సిట్ వివరణ కోరింది. సిట్ వివరణ తర్వాత ఏసీబీ కోర్టు ఇవాళ మరో కీలక ఆదేశం ఇచ్చింది.

రాజ్ కెసిరెడ్డి ఈ మెమోను పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు... సిట్, ఎస్బీఐ మాచవరం శాఖను రూ.11 కోట్లను ఇతర నిధులతో కలపవద్దని ఆదేశించింది. సిట్ స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని విడిగా ఉంచాలని కోర్టు ఆదేశించింది.అలాగే అన్ని కరెన్సీ నోట్ల సీరియల్ నంబర్లతో కూడిన వివరణాత్మక పంచనామాను సిద్ధం చేసిన తర్వాత మాత్రమే డబ్బును డిపాజిట్ చేయాలని సిట్ ను ఆదేశించింది.
ఆ నగదు ఇప్పటికే డిపాజిట్ చేసి ఉంటే.. దానిని ఇతర నోట్లతో కలపవద్దని ఏసీబీ కోర్టు స్టేట్ బ్యాంకక్ అధికారుల్ని ఆదేశించింది. స్వాధీనం చేసుకున్న నగదు నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం కోసమే ఈ ఆదేశాలు ఇచ్చింది. అలాగే వివరణాత్మక పంచనామాను ఆలస్యం చేయకుండా కోర్టుకు సమర్పించాలని కూడా సిట్కు సూచించింది. దీంతో ఆ 11 కోట్ల వ్యవహారం చివరికి ఎక్కడికి చేరుతుందో ఎవరికీ అంతుబట్టడం లేదు.












Click it and Unblock the Notifications