ఆ మార్కెట్లో కొన్న కూరగాయలే ఊరంతా పంచారట... విజయవాడలో మరో కల్లోలం
అది విజయవాడ రాజీవ్ గాంధీ హోల్ సేల్ కూరగాయల మార్కెట్. పండిట్ నెహ్రూ బస్టాండ్ కు అతి సమీపంలో ఉంటుంది. సాధారణ రోజుల్లో అక్కడ నిత్యం వేలాది మంది కూరగాయలు కొనేందుకు వస్తుంటారు. కానీ తాజాగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో మార్కెట్ కు వచ్చే వారి సంఖ్య తగ్గింది. అయితే అధికారుల అనుమతితో ఇక్కడి నుంచి హమాలీలు కూరగాయలను నగరంలోని వివిధ ప్రాంతాలకు పంచుతున్న వారికి పంపారు. ఆ తర్వాత వీరంతా కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. దీంతో ఇప్పుడు నగరంలో రాజీవ్ గాంధీ మార్కెట్ పేరు చెబితేనే భయపడే పరిస్ధితి నెలకొంది.
కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇప్పటికే సెంచరీ దాటేసింది. అయితే ఇవాళ ఒక్కరోజే 52 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ విజయవాడ నగరంలోనే కావడం విశేషం. అయితే ఈ కేసులకు ప్రధాన కారణాల్లో ఒకటి నగరంలోని రాజీవ్ గాంధీ మార్కెట్. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు మార్కెట్లకు రాకపోవడంతో రాజకీయ నేతలు భారీ ఎత్తున ఇక్కడి నుంచి కూరగాయలను కొని వివిధ ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారు.

కొన్ని రోజులుగా జరుగుతున్న పంపిణీ తర్వాత తాజాగా మార్కెట్ లో పనిచేస్తున్న హమాలీలకు కరోనా సోకినట్లు తెలియడంతో ఇప్పుడు వారి చేతుల మీదుగా కూరగాయలు తీసుకెళ్లిన రాజకీయ నేతలు, పారిశుద్ధ్య సిబ్బంది, జర్నలిస్టుల పరిస్ధితి ఆందోళనకరంగా మారింది.

విజయవాడ నగరంలో పెరుగుతున్న కేసుల వ్యవహారం ఎవరికీ అంతుబట్టడం లేదు. కేవలం మూడు ప్రాంతాల నుంచే 60 కేసులు నమోదైనట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. ఇందులో కృష్ణలంక, కార్మిక నగర్, ఖుద్ధూస్ నగర్ ప్రాంతాల్లో తలో 20 కేసులు నమోదయ్యాయి. వీటిలో కృష్ణలంక ప్రాంతం రాజీవ్ గాంధీ మార్కెట్ కు అత్యంత సమీపంలో ఉండటంతో ఇప్పుడు అక్కడ నమోదైన కేసులు నగరంలోని వివిధ ప్రాంతాలకు ఏ మేరకు వ్యాప్తి చెందాయో అంచనా వేయలేని పరిస్ధితి. తాజా పరిణామాల నేపథ్యంలో నగరంలో కూరగాయలు ఫ్రీగా ఇచ్చినా తీసుకోవాలంటే ప్రజలు జంకే పరిస్ధితి.












Click it and Unblock the Notifications