మహిషాసురమర్ధినిగా బెజవాడ దుర్గమ్మ- నవ దుర్గల్లో అత్యుగ్ర రూపంలో దర్శనం
విజయవాడలో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతుతున్నాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన నిజ ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ మహిషాసురమర్థినీ దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. అష్ట భుజాలతో దుష్టుడైన మహిషాసురుడిని అమ్మవారు సంహరించింది ఈ రూపంలోనే. అందుకే ఇది నవదుర్గల్లో అత్యుగ్రరూపం. ఈ రోజున జగన్మాత కనకదుర్గమ్మ లేతరంగు దుస్తుల్లో సింహ వాహనాన్ని అధిష్టించి, ఆయుధాలను ధరించిన మహాశక్తిగా భక్తులను సాక్షాత్కరిస్తుంది. ఈ తల్లికి గారెలు, బెల్లంతో కలిపిన అన్నాన్ని నైవేద్యంగా నివేదిస్తారు.
దేవీ నవరాత్రులలో తొమ్మిదో రోజున ఆశ్వయుజ శుద్ధనవమి తిథి ఉన్నప్పుడు మహర్నవమి అంటారు. ఎనిమిది రోజుల యుద్ధం తరవాత అమ్మ నవమినాడు మహిషాసురుణ్ని మర్దించి, లోకాలన్నింటికి ఆనందాన్ని చేకూర్చింది. అమ్మ అవతారాన్నింటిలో దుష్టశిక్షణ చేసిన ఈ రూపం అత్యుగ్రం. అందరు దేవతలు చేసిన చిద్యాగ కుండం నుంచి వెలుగుముద్దగా ఆవిర్భవించి, సకల దేవతల అంశలను గ్రహించి, వారిచ్చిన ఆయుధాలను, అలంకారాలను ధరించి స్త్రీలను చులకనగాచూసి దున్నపోతు మనస్తత్వం మూర్తీభవించిన మహిషాసురుణ్ని సంహరించింది. సింహవాహనయై, ఉగ్రరూపంతో, అష్టభుజాలతో పాశం, అంకుశం, త్రిశూలం మొదలైన ఆయుధాలను ధరించి దర్శనమిచ్చే మహాశక్తిని పూజిస్తే శత్రుభయం ఉండదు.

అన్ని అవతారాలలోనూ ఆది పరాశక్తి దుష్ట రాక్షసులని సంహరించింది ఆశ్వయుజ శుద్ధ నవమి నాడే. అందుకే దీనికి ప్రత్యేకత. సంవత్సరంలో ఉండే 24 నవమి తిథుల్లోనూ గొప్పది కనుక మహర్నవమి అని పిలవబడుతుంది. ఈ నాటి మరొక విశేషం ఆయుధ పూజ. అన్ని వృత్తుల వారు తమ తమ ఆయుధాలని పూజిస్తారు. దేనినైనా సాధించడానికి ఉపయోగపడే పనిముట్లని పూజించే గొప్ప సంస్కృతి మనది.
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను నటి హేమ ఇవాళ దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని హేమ తెలిపారు. దసరా లో ప్రతీ ఏటా అమ్మవారిని దర్శించుకుంటానని, కొండంత ధైర్యం ఇవ్వమని అమ్మవారిని కోరుకున్నానని హేమ వెల్లడించారు. మా ఎలక్షన్స్ లో రాత్రి గెలిచాము ఉదయం ఓడిపోయాము..ఏం జరిగిందో ఆ అమ్మవారికే తెలియాలంటూ నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశారు.












Click it and Unblock the Notifications