ఏపీలో నేటినుంచి అక్కడ ఉచిత బస్సు సౌకర్యం
కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అధికారులు విధివిధానాలను రూపొందిస్తున్నారు. ఎప్పుడెప్పుడా? అని మహిళలు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గరకు మూడురోజులపాటు ఉచితంగా బస్సు సర్వీసులను నడుపుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
కొండచరియలు విరిగిపడకుండా పనులు
విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో భక్తుల రక్షణ కోసం భద్రతా చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. మూడురోజులు ఘాట్ రోడ్డును మూసేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కనకదుర్గానగర్ మీదుగా రావాలని అధికారులు సూచనలు జారీచేశారు. ఘాట్ రోడ్డులో వీఐపీలోతో సహా ఎవరికీ అనుమతి లేదని దేవాలయం ఎగ్జిక్యూటివ్ అధికారి స్పష్టం చేశారు. వినాయకగుడి, స్నానాల రేవు నుంచి కనకదుర్గానగర్ వరకూ ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ మార్పులు గమనించాలని, అందుకనుగుణంగా రావాలన్నారు.

అవినీతి అధికారులపై కఠిన చర్యలు
విజయవాడ కనక దుర్గమ్మ గుడిలో అవినీతి ఎక్కువగా ఉందని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో దీనిపై దృష్టిసారించింది. ముందుగా ఆలయానికి సంబంధించి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్నిరకాల పనులు పూర్తిచేయాలని, భక్తుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూసుకొని ఆ తర్వాత అవినీతికి పాల్పడేవారి భరతం పట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అటువంటివారిపై కఠినచర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం. ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని, అయ్యవారిని శృంగేరి శారదా పీఠాధిపతి శంకరాచార్య విధుశేఖర భారతి స్వామీజీ దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. మహా మండపంలో భక్తులకు ప్రవచనం చెప్పారు.












Click it and Unblock the Notifications