శరన్నవరాత్రులకు సిద్ధమవుతున్న బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం..
దసరా పండుగ మరికొద్దిరోజుల్లో సమీపిస్తోంది. ఇలాంటి తరుణంలో చాలామంది బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించాలనకుంటారు. ఏపీలో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలలో కనకదుర్గమ్మ ఆలయం ఒకటి. ఈ ఆలయానికి నిత్యం భక్తులు తరలి వస్తుంటారు. ఇక, దసరా పండుగ వేళ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ భక్తులు బారులు తీరుతారు. ఎందుకంటే, దసరా నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఎంతో ప్రత్యేకం. దసరా సమయంలో ఇంద్రకీలాద్రి దృశ్యాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఆలయ ప్రాంగణమంతా భక్తుల కోలాహలంతోపాటు భవానీ మాలధారులతో సందడి సందడిగా ఉంటుంది. ఆలయాన్ని సరికొత్తగా తీర్చిదిద్దుతారు. ప్రత్యేక లైటింగ్లతో ఆలయమంతా మెరిసిపోతుంటుంది. నవరాత్రుల్లో భాగంగా కనకదుర్గమ్మ అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తుంటారు.
ఇక, ఈ ఏడాది ఇంద్రకీలాద్రిపై అక్టోబరు 3వ తేది నుంచి 12వ తేది వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 12న దసరా పండుగా సందర్భంగా శరన్నవరాత్రులకు కనకదుర్గమ్మ ఆలయం ముస్తాభవుతోంది. అధికారులు ఆ ప్రకారం ఏర్పాట్లు చేయనున్నారు. నిన్న ఉన్నతాధికారులు సమావేశమై చర్చలు జరిపారు. దసరా సమయంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో అమ్మవారి దర్శనానికి విచ్చేస్తారు కాబట్టి వారికి అన్ని రకాల సదుపాయాలూ కల్పించనున్నారు. ప్రతీ ఏడాది లాగానే.. ఈసారి కూడా మూలా నక్షత్రం రోజు అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈసారి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు అమ్మవారికి అందజేస్తారు. అందుకు తగిన విధంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాల వివరాలివే..
అక్టోబరు 3వ తేదిన - బాలా త్రిపుర సుందరి దేవి
అక్టోబరు 4వ తేదిన - గాయత్రీ దేవి
అక్టోబరు 5వ తేదిన - అన్నపూర్ణ దేవి
అక్టోబరు 6వ తేదిన - లలిత త్రిపుర సుందరి దేవి
అక్టోబరు 7వ తేదిన - మహాచండీ దేవి
అక్టోబరు 8వ తేదిన - శ్రీమహలక్ష్మి దేవి
అక్టోబరు 9వ తేదిన - సరస్వతి దేవి (మూలా నక్షత్రం)
అక్టోబరు 10వ తేదిన - దుర్గాదేవి
అక్టోబరు 11వ తేదిన - మహిషాసుర మర్దిని
అక్టోబరు 12వ తేదిన - శ్రీ రాజరాజేశ్వరిదేవి












Click it and Unblock the Notifications