కోడికత్తి కేసులో విజయవాడ ఎన్ఐఏ కోర్టు కీలక ఆదేశం-ఫిబ్రవరి 15న విచారణకు వైఎస్ జగన్ ?
2019 ఎన్నికలకు ముందు తీవ్ర సంచలనం రేపిన కోడి కత్తి దాడి కేసులో బాధితుడిగా ఉన్న ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ ను తమ ముందు హాజరుపర్చాలని విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఏపీలో గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి వ్యవహారంలో విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ జోరందుకుంది. ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్ ఏడోసారి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చిన ఎన్ఐఏ కోర్టు.. ఇవాళ రెగ్యులర్ విచారణ ప్రారంభించింది.
విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై జరిగిన కోడికత్తి దాడి కేసులో నాలుగేళ్లుగా విచారణ ముందుకు సాగలేదు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ తగిన ఆధారాలు సంపాదించినా, నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ బెయిల్ కూడా లేకుండా రాజమండ్రి జైల్లోనే ఉంటున్నాడు. తాజాగా దీనిపై విచారణ ప్రారంభించిన ఎన్ఐఏ కోర్టు.. ఇవాళ వాదోపవాదాలు నిర్వహించింది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్ ను ఇప్పటివరకూ కోర్టు ముందు ఎందుకు హాజరుపర్చలేదని గత విచారణ సందర్భంగా ప్రశ్నించిన ఎన్ఐఏ కోర్టు ఈసారి జగన్ హాజరుకు షెడ్యూల్ ఇచ్చింది.
ఈ కేసులో తొలి సాక్షిగా ఉన్న విశాఖ ఎయిర్ పోర్ట్ అసిస్టెంట్ కమాండెంట్ రాఘవ కూడా విచారణకు హాజరు కాకపోవడంతో కేసుకు సంబంధించి మొత్తం ట్రయల్ షెడ్యూల్ ను కోర్టుకు సమర్పించాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. ఇందులో విక్టిమ్ (బాధితుడు జగన్) షెడ్యూల్ కూడా ఉండాలని తెలిపింది. ఈ కేసులో బాధితుడు జగన్ కావడంతో ఆయన కూడా కోర్టుకు వచ్చేలా షెడ్యూల్ ను రూపొందించాలని ఎన్ఐఏను జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసిన కోర్టు ఆరోజు విచారణకు జగన్ రావాలని ఆదేశాలు జారీ చేశారు.