కొత్త జిల్లాల సిత్రాలు-మచిలీపట్నంలోకి బెజవాడ శివార్లు-కార్పోరేషన్ విలీనం ఆశలు గల్లంతు
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కొత్త వివాదాలను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రం నడిబొడ్డున ఉన్న విజయవాడ జిల్లా చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. విజయవాడ కార్పోరేషన్ లో విలీనం అవుతాయని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శివారు ప్రాంతాల్ని ప్రభుత్వం కాస్తా బందరు జిల్లాలో విలీనం చేయడంతో ఇప్పుడు వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి.
విజయవాడ జిల్లా వివాదాలు
ఏపీలో విజయవాడ జిల్లా ఏర్పాటు వ్యవహారంలో పలు వివాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు ఉన్న మచిలీపట్నం జిల్లాను వదిలిపెట్టి విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై ఓ వివాదం రేగుతుండగా.. ఇప్పుడు విజయవాడ శివారు ప్రాంతాల్ని తీసుకెళ్లి బందరులో కలపడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ప్రభుత్వ నిర్ణయంతో విజయవాడ కార్పోరేషన్ మరగుజ్జు కార్పోరేషన్ గా మారుతుందనే ఆందోళనలూ నెలకొన్నాయి.
మచిలీపట్నంలోకి బెజవాడ శివార్లు
ప్రభుత్వం ఇచ్చిన తాజా నోటిఫికేషన్ ప్రకారం చూస్తే విజయవాడ శివారు ప్రాంతాలైన రామవరప్పాడు, ప్రసాదం పాడు, ఎనికేపాడు, నిడమానూరు, కానూరు, పోరంకి, పెనమలూరు వంటి గ్రామాలన్నీ ఇప్పుడు మచిలీపట్నం జిల్లాలోకి వెళ్లనున్నాయి. ఇప్పటివరకూ ఈ గ్రామాలన్నీ విజయవాడ కార్పోరేషన్ లో కలుస్తాయని అంతా భావించారు. ఆ మేరకు అక్కడ భూముల మార్కెట్ విలువలు కూడా పెరిగాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో విజయవాడకు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాలన్నీ 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం జిల్లా కేంద్రానికి అనుసంధానం కాబోతున్నాయి. దీంతో కొత్త సమస్యలు తప్పేలా లేవు.
కార్పోరేషన్ లో విలీనం లేనట్లే?
ఇప్పటిదాకా విజయవాడ శివార్లలో ఉన్న పంచాయతీలన్నీ ఏదో ఒక రోజు ప్రభుత్వం చేపట్టే కార్పోరేషన్ విస్తరణతో విజయవాడ సిటీలో భాగమవుతాయని అంతా ఆశించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రతిపాదనను వదిలేసి రాష్ట్రంలో మిగతా కార్పోరేషన్లన్నీ విస్తరిస్తూ పోతున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఈ గ్రామాలకు భారీ షాకిచ్చింది. తాజా జిల్లా ప్రతిపాదనలో మచిలీపట్నం జిల్లాలోకి వెళ్తున్న ఈ గ్రామాల్ని విజయవాడ కార్పోరేషన్ లో విలీనం చేయడం కష్టమేనని భావిస్తున్నారు. ఎందుకంటే జిల్లాగా మారిన తర్వాత ఇక ఈ గ్రామాలన్నీ జిల్లా సరిహద్దు గ్రామాలుగా మిగిలిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు.
బెజవాడ శివార్లకు కొత్త కష్టాలివే
ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాజా జిల్లాల్లో విజయవాడ శివారు గ్రామాలన్నీ నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ జిల్లా కేంద్రాన్ని వదిలిపెట్టి 70 కీలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం జిల్లా కేంద్రానికి అనుసంధానం కావడం ఖాయం. అప్పుడు కలెక్టరేట్ తో పాటు ఇతరత్రా ఏ పనులు కావాలన్నీ ఇక్కడి ప్రజలు మచిలీపట్నం వెళ్లాల్సిందే.
ఇప్పటివరకూ ఒకే జిల్లాగా ఉండటంతో విజయవాడలోనే అన్ని కార్యాలయాలు అందుబాటులో ఉండేవి. నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంతో పాటు ఇతర రెవెన్యూ కార్యాలయాలు కూడా అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ గుడివాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వెళ్తున్నాయి. దీంతో ఇక్కడి ప్రజలంతా గుడివాడ లేదా బందరు వెళ్లక తప్పదు.