పవన్ కళ్యాణ్ పై విజయవాడలో కేసు నమోదు-వాలంటీర్లపై కామెంట్స్ పై ఈ సెక్షన్లతో..
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గత నెలలో వారాహి యాత్ర మొదలుపెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వానికి అన్నివిధాలుగా అండగా ఉంటున్న వాలంటీర్లను సైతం టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఏలూరులో జరిగిన వారాహి విజయయాత్ర సభలో పవన్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు.
Recommended Video

ఏలూరులో పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు సంక్షేమ పథకాల లబ్దిదారుల నుంచి సేకరించి ప్రభుత్వానికి ఇస్తున్న డేటా దుర్వినియోగం అవుతోందని, దీని వల్లే రాష్ట్రంలో మహిళలు అదృశ్యమవుతున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై వైసీపీ దీటుగా స్పందించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు వాలంటీర్లు కూడా రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఓ వాలంటీర్ ఇచ్చిన ఫిర్యాదుతో కృష్ణలంక పీఎస్ లో కేసు నమోదైంది.

విజయవాడకు చెందిన సురేష్ అనే వాలంటీర్ పవన్ కళ్యాణ్ ఏలూరులో చేసిన వ్యాఖ్యలపై కృష్ణలంక పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో పవన్ వ్యాఖ్యలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీటిపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ దర్యాప్తులో పవన్ పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది కీలకంగా మారింది.
విజయవాడ వాలంటీర్ ఫిర్యాదుతో కృష్ణలంక పోలీసులు నమోదు చేసిన కేసులో పవన్ కళ్యాణ్ పై సెక్షన్ 153, సెక్షన్ 153ఏ, సెక్షన్ 505(2) కింద అభియోగాలు నమోదు చేశారు. ఇవి సరైనవో కావో నిర్దారించుకోవడంతో పాటు వాటిపై తీసుకోవాల్సిన చర్యలపై కృష్ణలంక పోలీసులు దృష్టిసారిస్తున్నారు. మరోవైపు వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకూ వైసీపీ నేతలు, వాలంటీర్లు నిరసనలు చేపట్టడంతో పాటు ఫిర్యాదులు చేస్తున్నా తొలిసారి విజయవాడలో కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications