నిన్న మంత్రికి, నేడు రఘువీరా రెడ్డికి చేదు: మట్టితో దాడి చేశారు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరా రెడ్డికి ఆదివారం నాడు మచిలీపట్నంలో చేదు అనుభవం ఎదురయింది. బందరు విమానాశ్రయం కోసం ప్రభుత్వం సేకరించనున్న భూముల పరిశీలనకు రఘువీరా రెడ్డి వెళ్లారు.
ఈ సమయంలో ఆయన పైన కృష్ణా జిల్లా కోన గ్రామస్థులు మట్టితో దాడి చేశారు. బందరు పోర్టు కోసం భూములిచ్చేది లేదని ఇప్పటికే గ్రామస్థులు తేల్చి చెప్పారు. మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, మంత్రి కొల్లు రవీంద్ర ఎంతమేర నచ్చజెప్పినా రైతుల్లో మార్పు రాలేదు.
ఈ క్రమంలో అక్కడి పరిస్థితిని సమీక్షించడంతో పాటు భూముల పరిశీలనకు రఘువీరా రెడ్డి ఆదివారం ఉదయం కోన గ్రామానికి వెళ్లారు. తమ గ్రామంలో రాజకీయ నేతను చూసిన కోన గ్రామస్థులు ఒక్కసారిగా ఆగ్రహోదగ్రులయ్యారు.
తమ గ్రామంలోకి ఏ ఒక్క రాజకీయ నాయకుల ప్రవేశానికి వీలులేదని తేల్చి చెప్పారు. రఘువీరాపై మట్టితో దాడి చేశారు. అయితే, రఘువీరా రెడ్డి పైన దాడికి పాల్పడింది టిడిపి కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరులు అని చెబుతున్నారు. వారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రఘువీరా రెడ్డిని అడ్డుకున్న వారిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, కోన గ్రామంలో శనివారం నాడు మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనవకళ్ల నారాయణ పర్యటించారు. తమ భూములు ఇచ్చేది లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తే చేసి దాడికి యత్నించారు. వారు పోలీసుల సహాయంతో అక్కడి నుంచి వెళ్లారు.