దొరికినోడికి దొరికినన్ని వజ్రాలు: ఎగబడుతున్నారు..!!
Monsoon 2024: నైరుతి రుతుపవనాల రాక ప్రభావం కనిపిస్తోంది. ఈ సీజన్లో సకాలంలో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. అంచనా వేసిన దానికంటే ఒక రోజు ముందే అంటే ఈ నెల 31వ తేదీ నాటికి అవి కేరళ వద్ద తీరాన్ని తాకనున్నట్లు ఇప్పటికే వాతావరణం కేంద్రం అంచనా వేసింది. అనంతరం రెండు వారాల వ్యవధిలో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరిస్తాయి.
దీనికి అనుగుణంగా కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి కూడా. ఈ రెండు రాష్ట్రాల తీర ప్రాంత జిల్లాల్లో ఆశించిన స్థాయికంటే అధికంగా వర్షపాతం నమోదవుతూ వస్తోంది. జూన్ మొదటి వారంలో ఏపీ, తెలంగాణపై రుతుపవనాల ప్రభావం ఉండొచ్చంటూ వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఏపీలో రుతుపవనాల రాకతో పాటు- వజ్రాలు, రంగురాళ్ల అన్వేషణ మొదలయింది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వజ్రాల అన్వేషణలో పడ్డారు గ్రామస్తులు. ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో ఈ రెండు జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లో చిన్నసైజు వజ్రాలు, అత్యంత విలువ ఉండే రంగు రాళ్లు లభించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే.
తొలకరి వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో ఈ రెండు జిల్లాల్లో వజ్రాల వేట మొదలుపెట్టారు స్థానికులు. జొన్నగిరి, తుగ్గలి, మద్దికెర.. వంటి గ్రామాల్లో జోరుగా వీటి అన్వేషణ కొనసాగుతోంది. ఇంటిపట్టున ఉండే మహిళలు పెద్ద సంఖ్యలో పొలం బాట పట్టారు. పొలాల్లో రంగురాళ్ల వెదుకులాటలో పడ్డారు.

వేసవి సెలవులు కొనసాగుతున్నందున పిల్లలూ రంగు రాళ్లను అన్వేషిస్తోన్నారు. కర్నూలు జిల్లా మద్దెకెర మండలం హంపా గ్రామంలో ఓ రైతుకు ఓ వజ్రం దొరికడం.. ఈ అన్వేషణకు మరింత బలాన్ని చేకూర్చింది. దీని విలువ బహిరంగ మార్కెట్లో 30 లక్షల రూపాయలుగా చెబుతున్నారు. ఆ వజ్రాన్ని పెరవలికి చెందిన ఓ వ్యాపారి వేలం పాటలో కొనుగోలు చేశారు.












Click it and Unblock the Notifications