విశాఖపట్టణం:ఏపీఐఐసీ సర్వేయర్ చిరంజీవి ఇంట్లో ఏసీబీ సోదాలు...భారీగా అక్రమాస్థుల గుర్తింపు
విశాఖపట్నం:రాష్ట్రంలో మళ్లీ ఎసిబి దాడుల కలకలం మొదలైంది. తాజాగా ఏపీఐఐసీ సర్వేయర్ చిరంజీవిరావు ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం సోదాలు నిర్వహించారు.
ఆదాయానికి మించి అక్రమాస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. విశాఖలో చిరంజీవి సన్నిహితులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు. ఏసీబీ డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో మొత్తం పది చోట్ల ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం.

ఇప్పటి వరకు చిరంజీవికి సంబంధించి జరిపిన సోదాల్లో ఆయనకు రెడ్డిపల్లిలో 4 ఎకరాల వ్యవసాయ భూమి, భోగాపురంలో 300 గజాల స్థలం, రేవాళ్ళపాలెంలో 80 గజాల స్థలం, మురళీనగర్లో 200 గజాల్లో ఇల్లు, ఒక ప్లాట్ను గుర్తించారని తెలిసింది. ఇంకా బ్యాంకు లాకర్లు పరిశీలించాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు.
ఈయనపై గతంలోనూ పలు అవినీతి ఆరోపణలు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.
విశాఖలో అక్రమ,అవినీతి నిరోధక శాఖల వరుస దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి,పేరం గ్రూప్స్ అధినేత పేరం హరిబాబుకు చెందిన ఆస్తులపై ఐటీ శాఖ దాడులు నిర్వహించడం కలకలం రేపగా...తాజాగా ఏపీఐఐసీ సర్వేయర్ చిరంజీవి నివాసం పై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications