ఆ చివరి పేజీ హడావిడిగా రాశారు, తీగలాగుతున్నాం!: జగన్పై దాడి చేసిన వ్యక్తిపై విశాఖ సీపీ
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పై విశాఖపట్నం విమానాశ్రయంలో దాడి చేసిన శ్రీనివాస రావును పోలీసులు కోర్టుకు తరలించారు. ఈ దాడిలో జగన్ ఎడమ చేతికి గాయమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విశాఖ సీపీ లడ్డా మాట్లాడారు. జగన్ పైన దాడికి కోడిపందెంలో వాడే కత్తిని వాడారని చెప్పారు.
ట్విస్ట్: 'జగన్పై ప్రాణాపాయంలేని దాడి జోస్యం నిజమైంది, సీఎం చేయాలనే పిచ్చి అభిమానమే'
శ్రీనివాస రావు నుంచి 11 పేజీల లేఖ దొరికిందని, దాని పైన అతనిని విచారించామని చెప్పారు. 9 పేజీలు సోదరి వరసైన విజయలక్ష్మితో రాయించానని తమ విచారణలో చెప్పాడని అన్నారు. మరో పేజీలో అదే రెస్టారెంటులో పని చేస్తున్న అటెండర్ రేవతిపతితో రాయించాడని తెలిసిందన్నారు.
ఆ కత్తితో పాటు మరో కత్తి స్వాధీనం
రేవతిపతి శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోలికి చెందిన వ్యక్తి అని సీపీ లడ్డా చెప్పారు. రేవతిపతి నాలుగు నెలలుగా ఎయిర్ పోర్టు రెస్టారెంటులో పని చేస్తున్నాడని చెప్పారు. జగన్ పైన దాడి చేసిన కత్తి పొడవు 8 సెంటీ మీటర్లు ఉందన చెప్పారు. ఆ కత్తిలో వాడిగా ఉన్న భాగం మూడు సెంటీ మీటర్లేనని చెప్పారు. శ్రీనివాస్ వద్ద మరో చిన్న కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
గతంలో జగన్ను కలవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు
శ్రీనివాస్ 12 నెలల్లో ఒకే సిమ్తో 9 సెల్ఫోన్లు వాడాడని చెప్పారు. వీటి పైనా విచారణ జరుపుతున్నామని చెప్పారు. జగన్ను కలవడానికి గతంలో శ్రీనివాస్ ప్రయత్నించి విఫలమయ్యాడని సీపీ లడ్డా చెప్పారు. చివరి పేజీ జగన్ను కలిసే ముందు హడావుడిగా రాశాడని చెప్పారు. ఎయిర్ పోర్ట్ రెస్టారెంట్ యజమానికి నోటీసులు ఇచ్చామని వెల్లడించారు.
లేఖపై పలు అనుమానాలు
కాగా, ఆ లేఖపై పలువ అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. లేఖలో మొదటి పేజీ మొదలుకొని చివరి పేజీ వరకు దస్తూరీలలో మార్పులు కనిపించాయి. అంతేకాదు, దానిని గురువారం రాత్రి విడుదల చేశారు. పదో తరగతి చదువుకున్న శ్రీనివాస రావు రాసిన లేఖ పట్ల పలు నుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో లేఖ అతనే రాశాడా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
వైయస్ రాజశేఖర రెడ్డి అంటే అభిమానం అంటూ ప్రారంభం
అన్నా ప్రజల హృదయంలో కొలువుండి ప్రజలు దైవంగా భావించిన వైయస్ రాజశేఖర రెడ్డి అంటే అభిమానం అంటూ ఆ లేఖ ప్రారంభమవుతుంది. ఇందులో అతను పలు అంశాలను పేర్కొన్నట్లుగా ఉంది. డీజీపీ కూడా అతను జగన్ అభిమాని అని ప్రకటించారు. ఈ లేఖపై విమర్శలు, అనుమానాలు రావడంతో ఇప్పుడు సీపీ వివరణ ఇచ్చారు.