విశాఖ స్టీల్ ప్లాంట్పై అడుగు ముందుకేసిన వైసీపీ..!!
Visakhapatnam Steel Plant: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది. ఉక్కును ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి ఇనుము, బొగ్గు సరఫరా స్తంభించిపోవడంతో అనేక అనుమానాలకు తెర తీసినట్టయింది.
విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని వందశాతం మేర ప్రైవేటీకరించి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. దాన్ని విక్రయించే దిశగా అడుగులు వేసింది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇదివరకు రాజకీయ పార్టీలు నిర్వహించిన ప్రదర్శనలను గానీ, ఆందోళనలను గానీ కేంద్ర ప్రభుత్వం బేఖాతర్ చేస్తూ వచ్చింది.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రయత్నాలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా అడ్డుకున్నారు. ఫలితంగా ప్రైవేటీకరణ ముందుకు సాగలేదు. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ- ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.
మిత్రపక్షాల సహకారంతో ఏపీలో తామే అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో విశాఖపట్నం ఉక్కు కర్మాగారం విక్రయ ప్రయత్నాల్లో వేగం పెంచింది కేంద్ర ప్రభుత్వం. శరవేగంగా ప్రైవేటుపరం చేయడానికి పావులు కదుపుతోంది. వీలైనంత వేగంగా దీన్ని విక్రయించాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. దూకుడు పెంచింది.
ఇందులో భాగంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి.. ఈ ఏడాది జులైలో విశాఖపట్నానికి వచ్చారు కూడా. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ఆయా చర్యలన్నీ కూడా స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడానికేననే అభిప్రాయాలు కార్మికుల్లో బలంగా నాటుకుపోయాయి.
ఈ పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దిశగా ఓ అడుగు ముందుకేసింది. ప్రైవేటీకరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని కేంద్రానికి డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్లమెంట్ హౌస్లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామిని కలిసి వినతిపత్రం అందించింది.
కుమారస్వామిని కలిసిన వారిలో వైసీపీ ఎంపీలు వీ విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, డాక్టర్ మద్దిల గురుమూర్తి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తనూజా రాణి ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి ఎంత ప్రతిష్ఠాత్మకమో వివరించారు. గతంలో జరిగిన ఉద్యమాల గురించి వివరించారు.












Click it and Unblock the Notifications