జగన్ పార్టీని అసహ్యించుకుంటారు: భూమాను తలచి విష్ణుకుమార్ రాజు కంటతడి
దివంగత నేత భూమా నాగిరెడ్డిని తలుచుకుని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కంటతడి పెట్టారు.
అమరావతి: దివంగత నేత భూమా నాగిరెడ్డిని తలుచుకుని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కంటతడి పెట్టారు. మంగళవారం అసెంబ్లీలో సంతాప తీర్మానం అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాగిరెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హుందాతనానికి భూమానాగిరెడ్డి చిహ్నమన్నారు.
భూమానాగిరెడ్డి మంచి మనసున్న వ్యక్తని, తనకు మంచి మిత్రుడని చెప్పారు. భూమా ఆయన హఠాత్తుగా మరణించడం దురదృష్టకరమని విష్ణు చెప్పారు. తనతో భూమా నాగిరెడ్డి తన భార్య శోభానాగిరెడ్డి గురించి చెబుతుండేవారని, ఆ సమయంలో భూమా కళ్లలో నీళ్లు తిరిగేవని విష్ణుకుమార్ రాజు తెలిపారు. దీంతో తాను ఆ టాపిక్ను ఛేంజ్ చేసేందుకు ప్రయత్నించే వాడినని ఆయన చెప్పారు. భూమా మరణాన్ని తాను ఊహించలేదని చెప్పారు. తన పుట్టిన రోజు సందర్భంగా భోజనానికి కూడా ఆయన ఇంటికి ఆహ్వానించారని చెప్పారు.

విష్ణుకుమార్ రాజు ఆగ్రహం
భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానం సమయంలో సభకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు హాజరుకాకపోవడం దారుణమన్నారు. సంతాప తీర్మానంలోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పార్టీ కుసంస్కారం బయటపడింది.. ఆ పార్టీని ప్రజలు అసహ్యించుకుంటారని విష్ణు జోస్యం చెప్పారు.

జగన్ పార్టీపై ఫైర్
‘రాజకీయం చేయడం గురించి మాట్లాడటం లేదు. సహచర సభ్యుడి మరణానికి కూడా రాకపోవడం శోచనీయం. ప్రతిపక్షానికి మనసు రాలేదు. సంస్కారం ఉంటే రావాలి.
ఆ పార్టీ దుర్మార్గపు పార్టీ, ప్రజలు అసహ్యంచికుంటారు. రాజకీయ లభ్ది గురించి కాదు.. ప్రజాప్రతినిధి బీజేపీ పక్ష నేతగా మాట్లాడుతున్నా' అని విష్ణుకుమార్ రాజు అన్నారు.

దురదృష్టకరం
జగన్ లాంటి కుసంస్కారులు ఆంధ్రరాష్ట్రంలో ఉండటం దురదృష్టకరమని అన్నారు. జగన్ పార్టీ వచ్చే రెండేళ్లలో శాశ్వతంగా లేకుండా పోతుందని అన్నారు. గతంలో వారి పార్టీలో పని చేసిన వ్యక్తనే సానుభూతి కూడా లేదని మండిపడ్డారు. అఖిలప్రియ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భావిస్తున్నట్లు విష్ణుకుమార్ రాజు తెలిపారు.

కేఈ కృష్ణమూర్తి
భూమా మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. చిన్న వయస్సులోనే అకాల మరణం తీరని లోటని అన్నారు. తామిద్దరం పార్లమెంటు సభ్యులుగా కలిసి పనిచేసినట్లు గుర్తు చేసుకున్నారు. భూమా నాగిరెడ్డి గుర్తింపుగా ప్రభుత్వం ఏవైనా కార్యక్రమాలు చేపట్టాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సూచించారు. భూమా నాగిరెడ్డి ప్రజా సమస్యల పట్ల నిబద్ధతతో ఉండేవారని, తనకంటూ మంచి గుర్తింపు పొందారని కాల్వ శ్రీనివాసులు చెప్పారు. సభ్య సమాజం తలదించుకునేలా జగన్ వ్యవహరించారని టీడీ జనార్ధన్ అన్నారు.












Click it and Unblock the Notifications