వైజాగ్ : జగదాంబ జంక్షన్లోని ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం...
వైజాగ్లోని జగదాంబ జంక్షన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జంక్షన్లోని ఇండస్ ఆసుపత్రిలో గురువారం ఉదయం భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఆసుపత్రి రెండో అంతస్తులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పలువురు రోగులు భయంతో పరుగులు పెట్టారు. అయితే, ఆ మంటల్లో కొందరు రోగులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమర్జెన్సీ మార్గం గుండా పలువురు రోగులను బయటకు తీసుకొచ్చినట్లు సమాచారం. ఆస్పత్రి భవనం రెండో ఫ్లోర్లో ఉన్న ఆపరేషన్ థియేటర్లో ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీస్ కమీషనర్ రవి శంకర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
40 మంది రోగులను ఆసుపత్రి నుంచి బయటకు తెచ్చారు :సుమారు 40 మంది రోగులను ఆసుపత్రి నుంచి బయటకు తీసుకొచ్చి, వారిని అంబులెన్స్లలో వివిధ ఆస్పత్రులకు తరలించినట్లు తెలుస్తోంది. మొత్తం నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండస్ ఆస్పత్రి ఆవరణమంతా దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లోని దుకాణాలను అధికారులు మూసేశారు. ఈ ఘటనకు కారణాలేంటో తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.













Click it and Unblock the Notifications