మోడీ దృష్టికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్య-జగన్ కు ఉక్కు పరిరక్షణ సమితి వినతి
ఏపీలో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం తీసుకుని ఏడాది దాటిపోయింది. త్వరలో పూర్తిస్ధాయిలో ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. మరోవైపు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి పేరుతో ఏర్పడి కార్మికులు ఉద్యమాలు చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోడీని కలుస్తున్న సీఎం జగన్ కు ఉక్కు పరిరక్షణ కమిటీ ఓ విజ్ఞప్తి చేసింది.
ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకునేందుకు ఎలాంటి త్యాగాలకైనా ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వాలు గమనించాలని కమిటీ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే విషయం ప్రధాని మోడీ దృష్టికి కూడా తీసుకెళ్లాలని కమిటీ సీఎం జగన్ ను కోరింది. సొంత గనులు లేకపోయినా లాభాల్లో నడిచిన స్టీల్ ప్లాంట్ ప్లైవేటీకరణ కాకుండా చూడాల్సిన బాధ్యత సీఎం జగన్ పై ఉందని తెలిపింది. సీఎం జగన్ ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపడతారని కార్మికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది.
గత 477 రోజులుగా స్టీల్ ప్లాంట్ కోసం దీక్షలు, ధర్నాలు కొనసాగుతున్నాయని, గతంలో ప్రధానిని నాలుగు సార్లు కలిసిన సీఎం జగన్.. ఒక్కసారి కూడా ఆయన దృష్టికి స్టీల్ ప్లాంట్ విషయం తీసుకెళ్లలేదని కమిటీ గుర్తు చేసింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్.. ఈసారైనా స్టీల్ ప్లాంట్ సమస్యను ఆయనతో చర్చించాలని కమిటీ ప్రకటనలో కోరింది. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే బలమైన తెలుగు వారి ఆకాంక్షను, ఆత్మగౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మీపై ఉందని కమిటీ తెలిపింది.