సీఎం జగన్ వర్సస్ పవన్ వయా చంద్రబాబు - విశాఖలో ఎవరిది పై చేయి..!!
విశాఖ నగరం కేంద్రంగా ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. విశాఖ గర్జనతో మొదలైన వేడిని అక్కడే మకాం వేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ కొనసాగిస్తున్నారు. రాజకీయంగా పై చేయి సాధించేందుకు తెర వెనుక వ్యూహాలతో విశాఖ కొత్త సమీకరణాలకు వేదికైంది. విశాఖ పరిపాలనా రాజధాని డిమాండ్ తో జేఏసీ నిర్వహించిన విశాఖ గర్జన సక్సెస్ అయింది. వైసీపీ నేతలు ఆ సంతోషంతో ఉన్న సమయంలోనూ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలోనే విశాఖలో జనసేనాని అడుగు పెట్టారు. దానికి కొద్ది సేపు ముందే మంత్రులు రోజా..జోగి రమేష్..టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి కార్లపైన జనసైనికులు దాడి చేసారు.

మంత్రులపై దాడి.. పవన్ ఎంట్రీతో
ఇదే సమయంలో పవన్ కు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో జనసైనికులు తరలి వచ్చారు. విమానాశ్రయం నుంచిహోటల్ వరకు పవన్ భారీ ర్యాలీతో ముందుకు సాగారు. గర్జనకు పోటీగా తన బలం చాటుకొనేందుకు పవన్ ఈ అవకాశం సద్వినియోగం చేసుకున్నారు. మంత్రులపై దాడితో పోలీసులు అప్రమత్తం అయ్యారు. శనివారం రాత్రి డాడికి పాల్పడిన జనసైనికులను అరెస్ట్ చేసారు. పవన్ సీరియస్ అయ్యారు. నగరంలో సెక్షన్ 30 అమల్లో ఉండటంతో సభలు..సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు పవన్ కు నోటీసు ఇచ్చారు. దీంతో..జనవాణి రద్దు అయింది. పవన్ హోటల్ రూమ్ కే పరిమితం అయ్యారు. కానీ, నగరం వీడలేదు. ముఖ్యమంత్రి లక్ష్యంగా పవన్ తీవ్ర ఆరోపణలు చేసారు. ఇదే సమయంలో జగన్ కు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షాలు అన్నీ ఏకమయ్యాయి.

సీఎంకు వ్యతిరేకంగా ఏకమైన పార్టీలు
టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. నేరుగా పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసారు. మద్దతు ప్రకటించారు. బీజేపీ నేతలు సునీల్ దేవధర్.. సోము వీర్రాజు..పురంధేశ్వరి ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. మంత్రుల పైన దాడిని ఖండించని ప్రతిపక్ష నేతలు పవన్ కు మద్దతుగా నిలిచారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఈ వ్వవహారంలో అందరూ ఒక్కటయ్యారు. భవిష్యత్ సమీకరణాలపైన సంకేతాలు ఇచ్చారు. విశాఖ గర్జన కు డైవర్ట్ చేసేందుకే పవన్ విశాఖ వచ్చారనేది వైసీపీ ఆరోపణ. అసలు తాను ఈ విషయాన్నే పట్టించుకోలేదని పవన్ చెబుతున్నారు. కానీ, ముందు నుంచి అప్రమత్తం అవుతున్నా..అంత మంది జనసైనికులు ఆంక్షలు ఉన్న విమానాశ్రయ ప్రాంతానికి ఎలా వచ్చారనేది వైసీపీ నేతలకు అంతు చిక్కటం లేదు. గర్జన వేళ..టీడీపీ సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో రౌండ్ టేబుల్ నిర్వహించి..గర్జన నుంచి ప్రజల ఫోకస్ ను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేసింది. త్వరలోనే ప్రజా గర్జనకు నిర్ణయించింది. ప్రభుత్వం వర్సస్ పవన్ అన్నట్లుగా సాగుతున్న వార్ భవిష్యత్ కు అనుకూలంగా మలచుకొనేందుకు చంద్రబాబు సిద్దమయ్యారు

జగన్ వర్సస్ పవన్..టెన్షన్ కంటిన్యూ
కానీ, మంత్రుల కార్లపై దాడి.. పవన్ ఎంట్రీతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పవన్ ను బయటకు రాకుండా..హోటల్ కు పరిమితం చేయగలిగి నా.. ప్రతిపక్షాలు దీనిని ప్రభుత్వం పైన రాజకీయ దాడికి అస్త్రంగా మలచుకున్నాయి. పవన్ ప్లాన్ చేసుకున్న జనవాణి మాత్రం రద్దు అయింది. విశాఖ కేంద్రంగా పవన్ అందరినీ తనకు మద్దతుగా రాబట్టుకోవటం లో సక్సెస్ అయ్యారు. ప్రతిపక్షాలు పవన్ కు మద్దతు ఇవ్వటంలో ఆశ్చర్యం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రులపై దాడి చేస్తే చూస్తూ ఊరుకుంటామా అని ప్రశ్నిస్తున్నారు. కానీ, ఇంకా పవన్ విశాఖ వీడలేదు. హోటల్ లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. దీంతో..ఇప్పుడు విశాఖ కేంద్రంగా పై చేయి సాధించే రాజకీయ వ్యూహాల్లో ఎవరికి వారు తామే పై చేయి సాధించామని లెక్కలు వేస్తున్నాయి. ఇదే సమయంలో విశాఖ ఇమేజ్ - డామేజ్ చేస్తుందెవరనే అంశం పైన చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications