బొత్సా ను లెక్క చేయని ఎమ్మెల్యే : అందరి ముందే మంత్రి తో : సీఎంఓకు చేరిన వ్యవహారం..!!
ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీనియర్ మంత్రి బొత్సా సత్యనారాయణ కు ఇప్పుడు ఆ ఎమ్మెల్యే వ్యవహారం మింగుడు పడటం లేదు. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో విశాఖలో నాలుగు..శ్రీకాకుళంలో రెండు సీట్లు మినహా అన్ని స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది. విజయనగరంలో క్లీన్ స్వీప్ చేసింది. విజయనగరం నుండి బొత్సా సత్యనారాయణ...ఎస్టీ వర్గం నుండి పుష్ప శ్రీవాణీ డిప్యూటీ సీఎం హోదాలో కేబినెట్ లో ఉన్నారు. ఇక, ఉత్తరాంధ్రకు విజయ సాయి రెడ్డి పార్టీ ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు.
విజయనగరంలో జిల్లాలో బొత్సా ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టే వ్యూహాలు వైసీపీలో అమలవుతున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ సందేహాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. విజయనగరం జిల్లా మంత్రిగా బొత్సా అక్కడి రాజకీయాలతో పాటుగా..జిల్లాలో జరిగే డెవలప్ మెంట్ యాక్టివిటీ మీద సహచర మంత్రితో కలిసి ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే, అదే జిల్లాకు చెందిన పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు తీరు ఇప్పుడు చర్చకు కారణమైంది.
తాజాగా జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన హౌసింగ్ స్కీం..ఇంటి స్థలాల కేటాయింపు పైన మంత్రి బొత్సాను నిలదీసారు. ఇప్పటికే కేటాయించిన ప్రాంతం నుండి తమకు మరో స్థలం మార్చాలంటూ స్థానికులు కోరుతున్నారంటూ ఓపెన్ గా సమావేశంలోనే చెప్పుకొచ్చారు. ఇది మంత్రి బొత్సాకు ఆగ్రహం తెప్పించింది. ఎమ్మెల్యేగా ఉంటూ..నా వద్దకో..సంబంధిత జిల్లా అధికారి వద్దకో వచ్చి సమస్య పరిష్కరించుకోకుండా...ఇలా ఓపెన్ సమావేశంలో ప్రశ్నించటం ఏంటని బొత్సా సీరియస్ అయ్యారు.
మీరు చెప్పినట్లుగా స్థల మార్పు జరగదని..కావాలంటే అక్కడ మౌళిక వసతులు ఏర్పాటు చేస్తామంటూ స్పష్టం చేసారు. అంతటితో జోగారావు ఆగలేదు. మరింతగా బొత్సాను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసినట్లుగా కనిపించింది. అదే అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. బొత్సా ఆగ్రహం వ్యక్తం చేయటంతో ..జోగారావు సైతం స్వరం పెంచారు. ఎమ్మెల్యేగా ఉంటూ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే ఎలా అంటూ బొత్సా ప్రశ్నించారు. అయితే, ఈ వ్యవహారమే కాకుండా...జోగారావు తీరు పైన గతంలోనూ జిల్లా పార్టీలో పలు మార్లు చర్చ జరిగింది.
దీంతో..పార్టీకి కంచుకోటగా ఉండటంతో పాటుగా...ఎస్టీ నియోజకవర్గాలు అన్నింటా వైసీపీ విజయం సాధించింది. కానీ, జోగారావు ఇలా..ఓపెన్ గానే బొత్సాను నిలదీయటం రాష్ట్ర నేతల వరకు వెళ్లింది. ఈ వ్యవహారం సీఎంఓ కు చేరిందని చెబుతున్నారు. అయితే, మంత్రి బొత్సా తో ఎమ్మెల్యే జోగారావుకు పొసగటం లేదని..ఉద్దేశ పూర్వకంగానే ఈ రకంగా వ్యవహరిస్తున్నారనే వాదన జిల్లాలో వినిపిస్తోంది. ఇప్పుడు బొత్సా వర్సెస్ జోగారావు వ్యవహారం జిల్లా రాజకీయాల్లో హట్ టాపిక్ గా మారింది.