YS Jagan సర్కారుకు వాలంటీర్ల షాక్- రూ.12 వేల జీతం కోసం ఆందోళనలు - ఏడాదిన్నరకే
ఏపీలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు వైసీపీ సర్కారు నియమించుకున్న వాలంటీర్లు ఏడాదిన్నరకే షాకిచ్చారు. రూ.5 వేల రూపాయల గౌరవ వేతనంతో వీరిని ప్రభుత్వం నియమించగా.. ఇప్పుడు దాన్ని రూ.12 వేలకు పెంచాలంటూ వారు రోడ్లపై ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికల వేళ ప్రభుత్వానికి ఇదో తలనొప్పిగా మారింది. ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం జగన్ తమకు ఇస్తున్న 5 వేలను పది వేలకు పెంచుతారనే అంచనాల్లో ఉన్న వీరంతా ఇప్పుడు ఏకంగా 12 వేలు ఇవ్వాలని డిమాండ్లు చేస్తుండటం విశేషం.
ఏపీలో వాలంటీర్ల వ్యవస్ధ
ఏపీలో ప్రభుత్వ పథకాలన ప్రజలకు చేరువ చేసేందుకు వీలుగా వైసీపీ సర్కారు 2019లో అధికారంలో రాగానే గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్ధను ఏర్పాటు చేసింది. ప్రతీ 50 ఇళ్లకు ఓ వాలంటీర్ను నియమించడం ద్వారా అక్కడ ఉండే ప్రజలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా చేయడం, వాటిలో ఇబ్బందులు ఎదురైతే సాయం చేయడం వంటి పనులను అప్పగించారు. క్రమేణా వారి బాధ్యతలు పెరుగుతూ పోయాయి. ఇప్పుడు బియ్యం ఇళ్లకు అందించడంతో పాటు ప్రభుత్వం తీసుకొస్తున్న రోజుకో కొత్త పథకం కూడా వారి మెడకే చుట్టుకుంటోంది. దీంతో రూ.5 వేల రూపాయల గౌరవ వేతనంతో పని చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు.
జగన్ సర్కారుకు వాలంటీర్ల షాక్
2019 ఆగస్టులో తొలిసారిగా 2.67 లక్షల వాలంటీర్లను ప్రభుత్వం నియమించింది. అయితే రూ.5 వేల జీతానికి పనిచేయలేమంటూ దాదాపు 20 వేల మంది అప్పట్లోనే గుడ్బై చెప్పేశారు. అనంతరం వారి స్ధానాల్లో కొ్త్త వారిని నియమించారు. అయితే ఏడాది పూర్తి చేసుకున్న తర్వాత గౌరవ వేతనం పెంపు ఉంటుందని వారికి వైసీపీ నేతలు నమ్మబలికారు. దీంతో వారంతా అలాగే విధులు కొనసాగించారు. కానీ ఏడాది పూర్తయినా జీతాల పెంపు లేకపోవడం, ప్రభుత్వం నుంచి కనీసం ఆ మేరకు హామీ కూడా లభించకపోవడంతో వాలంటీర్లు నిన్న భారీగా రోడ్లపైకి వచ్చారు. రాష్టవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళనలకు దిగారు. అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు.
వాలంటీర్ల జీతం రెట్టింపు ఆశలు ఆవిరి
తొలుత రూ.5 వేల రూపాయల గౌరవ వేతనంతోనే మీరు పనిచేయాల్సి ఉంటుందని చెప్పిన ప్రభుత్వం.. ఆ తర్వాత పనితీరును బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. దీంతో పాటు వైసీపీ ప్రభుత్వంలో నేతలు, కార్యకర్తలు తమ ప్రభుత్వానికి కీలకంగా మారిన వాలంటీర్లకు ఏడాది తర్వాత రూ.8 వేలకు పెంచుతారని కొందరు, లేదు రెట్టింపు చేసి రూ.10 వేలు చేస్తారని మరికొందరు నమ్మబలికారు. దీంతో వారంతా జీతం రెట్టింపు అవుతుందని ఎదురు చూశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. దీంతో వారిలో అసహనం పెరిగిపోతోంది.
అందరికీ టార్గెట్గా వాలంటీర్లు
ఏపీ వాలంటీర్లకు గౌరవ వేతనం పెంపే కాదు మరెన్నో సమస్యలు ఉన్నాయి. వీటిలో నిర్ణీత పని వేళలు లేకపోవడం, అధికారులు, నేతలు, జనం వేధింపులు పెరుగుతుండటం కూడా సమస్యగా మారుతోంది. ప్రభుత్వ పథకాల్లో లబ్ధి దారులుగా చేర్చేందుకు క్షేత్రస్దాయిలో సర్వే చేసే బాధ్యత వీరిదే కావడంతో ఇప్పుడు ఏ పథకం ఎవరికి అందకపోయినా వారి నుంచి వాలంటీర్లకు ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. పరుష పదచాలంతో నేతలే కాదు జనం కూడా వీరిని తిట్టుకునే పరిస్ధితి. దీంతో వాలంటీర్ల బతుకు దయనీయంగా మారిపోతోంది. అయినా ప్రభుత్వం తమకు ప్రజల్లో మంచి పేరు తీసుకొస్తున్న వీరికి రక్షణ కల్పించేందుకు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయలేదు. దీంతో చివరి అస్త్రంగా వారు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు.
కీలక సమయంలో జగన్కు హ్యాండ్
వైసీపీ ప్రభుత్వం ఓ వైపు పంచాయతీ ఎన్నికలను ఎదుర్కొంటోంది. మరోవైపు త్వరలో పురపాలక, ఎంపీటీసీ, జడ్పీటీసీ పోరు కూడా ప్రారంభం కాబోతోంది. జనంలో ప్రభుత్వ పథకాలను పూర్తిస్ధాయిలో అందడం లేదన్న అసంతృప్తి పెరుగుతోంది. ఇలాంటి సమయంలో వారికి దగ్గరుండి అన్నీ చూసుకోవాల్సిన వాలంటీర్లు రోడ్డెక్కుతున్నారు. దీంతో కీలక సమయంలో వాలంటీర్ల ఆందోళనలు ప్రభుత్వానికి చికాకుగా మారుతున్నాయి. వీరిని తాత్కాలికంగానైనా బుజ్జగించేందుకు ప్రభుత్వం వెంటనే ఏదో ఒక హామీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ కారణంగా దానికీ అవకాశం లేదు. దీంతో పార్టీ తరఫున అంతర్గతంగా ఏదో ఒక హామీ ఇప్పించే అవకాశం ఉంది.